Sunday, January 29, 2012

శ్రీ కృష్ణ విలాపం !

శ్రీ కృష్ణ విలాపం


స్వామీ శ్రీ కృష్ణుల వారు చిద్విలాసం గా యమునా తీరే - తన పద హారు వేల మంది గోపికలతో కొలువై ఉండగా ఎవెర్ హ్యాపీ బ్లిస్స్ ఆనందా స్వామిజి గారు - ఉండేలు దెబ్బకి పరారి ఐ వచ్చిన కుందేలు వలె కృష్ణా జీ ముందు ధబీల్మని ప్రత్యక్షమై -

"హేక్ కృష్ణ- ఇదేమి నన్నిలా జనాలు వెంట పడి తరిమేలా చేస్తివి? నేనేమి పాపం చేసినాను- నువ్వేమో ముగ్గురు భామల తో చాలక పదహారు వేల మంది గోపికలతో ఉంటె - ఆ హా కృష్ణ విలాసం - అంతా విష్ణు మాయ అని జనాలు పోగిడేరు?

మరి నేను ఒక్కగానొక్క రాగ రంజిత హృదయేశ్వరి తో నా లోకం లో ఉంటె వాడెవడో నీవు శకుని కుటిలత్వాన్ని మాయ బజార్ లో అదేదో దర్పి ణి లో చూపెట్టినట్టు - నన్ను నీ కర్మభూమి లో నీ కర్మ నీదే అన్న రీతిలో నడి రోడ్డులో నిలిపేడు? ఇది ఏమైనా న్యాయమా స్వామీ ? అంటే

క్రిష్ణులవారు తన యోగ నిద్రని కాసేపు పక్కకి పెట్టీ - కళ్ళు మూసుకుని అవలోకించి - భక్తా - ఈ మధ్య నన్ను నీవు మరీ మరీ తలచుకుంటూ ఉంటివి

దేశం లో ఎడా పెడా భగవద్గీతల సభలలో నా గురించి మరీ పొగిడి తివి

ఆ హా నా భక్తుడు ఇంతగా నన్ను పొగిడే గదా అని నేను నిన్ను ఓ క్షణం తలిస్తిని.

మరో మారు తలిచేలోపు మా సత్య - స్వామీ భక్తులని మరీ ఎక్కువైగా తలవకండి ప్రాబ్లెం - అని చెప్పడం తో భక్తులని తలిస్తే ఏమి ప్రాబ్లెం అని ఓ క్షణం ఆలోచనలో పడితిని.

ఇంతకీ ఇదన్న మాట సంగతి - మరీ రసజ్ఞు డవే  అని " సరే అయినదేమో అయినది ఇక కావాల్సిన కార్య మేదో చూడు"  అని సలహా ఇచ్చేరు పరమాత్ముల వారు.

అంతా విష్ణు మాయే - నా చేతి లో ఏముంది అని కృష్ణు ల వారు ఆ యోగ మాయని ఓ క్షణం తలిచేరు.


ఈ కృష్ణుడు కూడా నన్ను కాల రాసాడే అని ఎవెర్ హ్యాపీ స్వామిజి గారు ఇంకా ఏమి చెయ్యడం - అని స్వామీ వారి మీంచి తన దృష్టిని యమునా పైకి - ఆ పై పదహారు వేల గోపికల పై కి చూపులని సారించేడు.

గోపికలలో రాగ రంజితాలు ఆతనికి గోచరించినై.

ఆ హా అర్థమైంది - యోగ మాయ ఉద్దేశం ఇదన్న మాట అని స్వ భాష్యం చెప్పుకుని "గోపికలూ - మీకు వ్రిందావనం గురించి చెబ్తాను ఇలా రండి " అన్నాడు చిరు నవ్వుతో !

అదిగో అప్పుడే మొదలైంది - శ్రీ కృష్ణులవారి "విలాపం" !

ఆ కాలం లో శంకరుడే భోళాశంకరుడని అనుకుంటిని - ఈ కలి యుగం లో నన్నే ఈ మానవుడు - బోల్తా కొట్టిన్చాడే - అని.

శ్రీ కృష్ణుల వారి విలాపాన్ని విని - కల్కి భగవాను ల వారు,

"వరదా" - నేను నీకు కలి గీత నేర్పిస్తాను ఇలా రా నాయనా అని

 "వరదా- భగవంతునికి భక్తునికి అనుసంధాన మైనది అంబికా అగరొత్తులు మాత్రమె కాదు - అంబిక "గరం" ఒత్తులు కూడా అనడంతో, కృష్ణుల వారు మూర్చ పోయి "హా సత్యా" - అంటే - హుష్ కాకి- సత్యమే లేచి పోయింది. !

******

అలా మూర్చ పోయిన కృష్ణ స్వాములు కొంత సేపటి కి తేరుకుని - కనులు తెరిచి చూసారు.

వారి కి కొంత దూరం లో - ఎవెర్ హ్యాప్యానంద, "విష్" ఆనంద , సీనియర్ ఐన భగవానంద అందరు కలిసి చిద్విలాసంగా స్వామీ వారి ని చూపిస్తూ - గోపిలకి  "డిష్" ఆనందా లాగ,

"అమ్మాయిలూ- భగవంతుడనే సాటి లైట్ కి మేము డిష్ లం.

మీ టీవీ లో ఆయన పిక్చర్ కనిపించాలంటే - మా లాంటి డిష్ ల అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం మా డిష్ లకి ప్రణమిల్లుకోండి అని ఉపన్యాసం దంచేస్తుండగా
కృష్ణ స్వాముల వారి కి ఏమి చెయ్యాలో పాలు పోక సరే పొతే పోనీ వీరి బాధ లేమి టో కనుక్కుంటే తాను ఏమైనా హెల్ప్ చెయ్య గలడేమో అని ఆలోచించి,


"ఓ స్వాములార - నేను ద్వాపర యుగం నాటి వాణ్ని.

మీ కష్టాలేమి? మీ కేమైనా కష్టాల ? నష్టాల? అని అడిగి చూసారు.

 స్వాములు నవ్వి - ఒకరి తరువాత ఒకరు గా ఇలా వాక్రుచ్చేరు.

"కృష్ణా ,  నువ్వు పురాణ కాలం లో ఉన్నావు.  పిల్లన గ్రోవి ఉంటె చాలను కుంటున్నావు . తప్పు స్వామీ, తప్పు .

ఈ కాలం భక్తులకి ఇవన్ని పనికి రాని వస్తువులు. ఈ కాలం లో భక్తులకి, బ్లాగులు - అంతర్జాల చమక్కులు -యు ట్యూబ్ బ్రాడ్ కాస్ట్ యువర్ సెల్ఫ్ లు లాంటి వి ఉంటె నే - స్వాముల వారి ని గమనిస్తారు.  ఎవరి కి ఎంత మంది ఫాన్స్ అన్నది వీటి మీద ఆధార పడి ఉంటై.

నీ టైం లో నువ్వు ఓ పద హారు వేల మంది నే పిల్లన గ్రోవితో ఆకర్షిస్తివి. 

నీ పిల్లన గ్రోవితో ఈ కాలం లో ఓ పోరిని కూడా పట్టలేవు నాయనా అని భగవానంద చెప్పగా కృష్ణుల వారు ముక్కు మీద వేలు వ్రేసుకుని తన పిల్లన గ్రోవిని ఓ మారు తడిమి చూసుకున్నారు-


"కృష్ణా - నీ కు పిల్లనగ్రోవిని ట్యూన్ చెయ్యడం మాత్రమె తెలుసు - మా ఎవెర్ హ్యాపి ఆనందా స్వామీ వారి కి పిల్లని ఎక్కడ మీటితే మిర్చి ఎఫ్ ఎం లా బాలీవుడ్ స్టైల్ కాకుంటే పాప్ స్టైల్ పలుకుతుందో - ఎక్కడ వేలిని తాకితే - ఎక్కడ తీగలు కదులు తాయో తెలుసు" అని విష్ ఆనందా వారు- గడ్డం తడివారు.


"కృష్ణా - విష్ ఆనందా తక్కువేమీ కాదు సుమా - ఆయన ఉత్తరాది వాడు - రెండు వేదాలు ఎక్కువే చదివేడు - అని ఎవెర్ హ్యాప్పీ ఆనందా స్వామీ వారు తనకు తెలియక పోయినా విష్ ఆనందా గారి గురించి పొగి డేడు.


కృష్ణ స్వాముల వారు ఓ మారు బుర్ర గోక్కుని - సరే స్వాములు - ఈ అమ్మాయిల విషయం లో ఏమి ఈ చపలత్వం - ఓ పక్క నా భగవద్గీత ని కాపీ రైట్స్ లేకుండా కాపీ కొడుతూ? అని అడిగిందే తడవు గా


ఎవెర్ హ్యాపి ఆనందా వారు- అమెరికన్ స్టైల్ లో - హేక్ క్రిస్- పురాణ కాలం లో ఎవడో పిచ్చి సన్నాసి ఈ కాషాయ వస్త్రాలని మా యూని ఫోరం గా పెట్టి పోయేడు. అప్పట్నుంచి మాకి ఇదో ట్రేడ్ మార్క్ ఐపాయింది.


ఓ రాజకీయ నాయకుడు పంచ కడతాడు. ఓ మిలిటరీ ఆఫీసర్ యూనిఫారం   వేస్తాడు. ఓ కలక్టరు సూట్ వేస్తాడు.

వీళ్ళంతా తమ పెళ్ళాల తో శృంగారం సాగించడానికి - సాంఘిక వ్యవస్థ ఆస్కారం కలిపించింది - పెళ్లి అన్న పేరుతో.

దాన్ని మీరి ఎంత మంది పొరిగింటి పోరి ల మీద పడటం లేదు? కాదన గలవా?

సన్నాసి కాషాయ వస్త్రాలు తీస్తే - శరీరం - సంసారి బట్టలూడ దీస్తే - శరీరం - దాని అవసరం దానికి - అంతా - నీ యోగ మాయ విలాసం - కాదంటావా?

పొయ్యే కాలం ఏమిటంటే - మాకు  వ్యవస్థ లేదు - శరీరాన్ని సుఖ పరచడానికి ఈ పిచ్చి మా లోకం మమ్మల్ని వీటి కి అంటరాని వాళ్ళ లా చూస్తోంది. కాదంటావా ?

అదీ గా క మా వద్ద వచ్చే పోరులంతా - యమ రంజుగా ఉండటం మేము చేసుకున్న పుణ్య ఫలం - ఈ కుళ్ళు బోతూ మా లోకం వాళ్లకి - ఈ పాటి తీరికా లేదు -పెళ్ళాల్ని సుఖ పెట్టడానికి! 

వీళ్ళంతా మేమేదో ఉద్దరిస్తామని మా దరి కోస్తారు- దరి కొచ్చే సుందరి ని కాదనడానికి మేము ఏమైనా వెర్రి సన్నా సులమా? " అని హింట్ ఇచ్చేడు.


కృష్ణా జీ "హా సత్యా" అని మరో మారు మూర్చ పోయేరు - ఇంకెక్కడి సత్యం- సత్యమెప్పుడో  లేచి పోయింది!
*****


శ్రీ కృష్ణుల వారు - కాస్త సమయం తీసుకొని నిద్ర లేచారు.

చుట్టూ చూసారు.

నిర్మానుష్యం. స్వాములు లేరు. తన పరివారమూ లేరు.

ఓ మారు కళ్ళు మూసుకుని ప్రశాంతం గా అవలోకించి - సరే ఫైనల్ గా మళ్ళీ ఓ మారు కర్మ భూమి లో - ఈ మారు సామాన్య ప్రజానీకాన్ని కదలించి - మీ కష్టాలేమిటి- ఇలా స్వాములోళ్ళతో ప్రాబ్లెమ్స్ లో ఇరుక్కుంటారేమిటీ ? అని కనుక్కుందామని, ప్రక్కన నారదుల వారు ఉంటె మంచిదని వారిని పిలుచుకొని కర్మ భూమి కి వచ్చేరు.

*****

కర్మ భూమి లో-

ఓ అమ్మాయీ, వాళ్ళ పేరెంట్స్ ఓ స్వామిజి ని కలవడానికి వెళ్తున్నారు- ఆ అమ్మాయిని నారదులవారు కదలించారు - "అమ్మాయీ అమ్మాయీ ఈ స్వామిజి ని ఎందుకు కలవాలని వెళ్తున్నావు?"


ఆ అమ్మాయి " ఏమో తెలీదు- మా అమ్మ వెళ్తోంది నేను వెళ్తున్న" అన్నది .

"అమ్మా , మీరెందుకు వెళ్తున్నారు? అంటే- "అదేమో తెలీదు - మావారు వెళ్తున్నారు - నేను వెళ్తున్నాను " అన్నది ఆవిడ.


"అయ్యా మీరెందుకు వెళ్తున్నారు స్వామీ? " అంటే- ఆ భర్త గారు- "మా ఆఫీసు లో నాకు ప్రొమోషన్ రాలేదండీ,  స్వామీ వారి బ్లెస్సింగ్ ఉంటె వస్తుందేమో అన్నఆశ తో వెళ్తున్నా"  అన్నాడు.


మరో అయ్యని కదలిస్తే - మా ఆవిడ వెళ్తోంది కాబట్టి నేను వెళ్తున్నాను అన్నాడు.


"భార్య గారు భార్య గారు - మీరెందు కు వెళ్తున్నారు " అంటే-

"చాలా కాలం నించి మాకు పిల్లలు లేరు.  ఈ బేబీ ఆనందా స్వామీ వారు  "ముద్దు బ్లెస్సింగ్" తో పిల్లల్ని పుట్టిస్తారని విన్నాము - ఆయన బ్లెస్సింగ్ తో పిల్లలు పుట్టాలని"  -చెబ్తూ పరవశం తో కనులు మూసుకుంది, ఆ భార్యా మణి!


మరో మానవుణ్ణి కదలిస్తే- "శ్రీ కాపానందా స్వామీ వారు మా కులం వారు- ఆ పాటి మేము సపోర్ట్ ఇవ్వక పొతే ఎలా?"  అన్నాడు.


ఓ రాజకీయ నాయకుణ్ణి కదలిస్తే-

"స్వామీ మీకు తెలియనిది ఏమి ఉన్నది? ఎక్కడ జన సందోహం ఎక్కువో అక్కడ మేముంటేనే మాకు పరపతి- మా ఇమేజ్ పెరగాలంటే - మేము ఈలాంటి 'సంఘాలని' సమాజలని తప్పక చూసి మా వచ్చే ఎన్నికలకి తయారు గా ఉండాలి"  అన్నాడు.


ఓ సిని తారని కదలిస్తే- "అందం ఒక్కటే కాదు స్వామీ మా ఫీల్డ్ కి కావాల్సింది- కాస్త పరిచయాలు కూడా,  ఇట్లాంటి పరిచయాలు - ఈ లాంటి క్లబ్బుల్లో మాకు చిక్కుతాయి అంది గుంభనగా.


ఓ విదేశీయుణ్ణి అడిగితే - "యోగం భోగం ఈ కర్మ భూమిలో దొరుకుతాయి స్వామీ అందుకే వచ్చా " అన్నాడు ఆ విదేశీయుడు !.


ఓ కాటి కి కాలు చాపుకున్న ముసలి వాణ్ని అడిగితే - "వచ్చే జన్మలో నేను ఎవెర్ యంగ్ గా" ఉండాలని స్వామీ వారి బ్లెస్సింగ్ కోసం వెళ్తున్న " అన్నాడు.


ఓ కుర్రకారు- "అక్కడ నా వయసు అమ్మాయిలూ ఎక్కువ వస్తారు నారదా - కాలేజి తరువాయి ఇక్కడే మా కాజోల్ ని మేము వెతకాలి " అన్నాడు.


ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ - ఆన్ సైట్ రావాలని - బ్లెస్సింగ్ కావాలన్నాడు.


ఓ మీడియా వాణ్ని అడిగితే -

"స్వామీ మా ప్రజలకి ఇరవై నాలుగు గంట లు మసాల న్యూస్ కావాలి.

మేము మసాల న్యూస్ ఇరవై నాలుగు గంట లు ఇవ్వాలంటే - జన సందోహ ప్రదేశాలలో - వెతికి వెతికి మసాల న్యూస్ లు పట్టాలి.

దానికి కొంత మార్ఫిజం  చెయ్యాలి - అప్పుడే మా ప్రేక్షకులకి నప్పుతాయి !

లేకుంటే మా ఛానల్ రేటింగ్ గోవిందా!

అంతెందుకు - గోవిందా గోవిందా ఛానల్ చూడండి - స్వామీ వారికే పబ్లిసిటీ కావాల్సి వొచ్చే- ఇరవై నాలుగు గంట లు"  

అంటూ వాపోయాడు ఆ మీడియా మానవుడు.

ఇవన్నీ వింటూ పోతూంటే - సైలెంట్ గా ఉన్న కృష్ణ స్వామీ వారి కి మళ్ళీ తల తిరిగింది.


ఇందులో ఒక్కరి కి కూడా భక్తీ అన్నది ఉన్నట్టులేదు.

యద్భావం తద్భవతి.

కోరికలే గుర్రాలు గా నా కర్మ భూమి వాళ్ళు స్వారి చేస్తూన్నారు. చేయి చేయి కలవనిదే చప్పట్టు రాదు.

ఈ చేయి కి ఆ చేయి ఆసరా.

భగవంతుడు సృష్టి కార్యం కోసం స్త్రీ పురుషులని సృష్టించాడు.

ఈ మానవులు - తమ కోరికల కోసం - వాటిని ఈదేరడం కోసం - ఈ స్వామిజి ల వెంట వేలం వెర్రి గా పడుతున్నారు.


ఇందులో సో కాల్డ్ భగవంతుని గా నా స్థానం ఏమి లేదు - కాకుంటే - శంఖం పూరించి- యదా యదాహి గ్లానిర్భవతి భారతా- అని మరో మారు అవతారం ధరించవచ్చు.

అయినా అందు వలన ప్రయోజనం ఉంటుందా? -

దీనికి పరిష్కారం ఏమిటి? అన్న ఆలోచనలో పడి -

కృష్ణాజి " హా సత్యా" అన్నారు.

ఈ మారు సత్య పక్కనే నిలబడి "స్వామీ " అన్నది.

ఏమి పరిష్కారం? అన్నారు కృష్ణాజి.

"నరకాసుర వధ" స్వామీ అన్నది సత్య. "మనిషిలోని అసురుడు వెళితేనే - కోరికలు తగ్గిస్తేనే - వీళ్ళ జీవితాలలో - జీవనం.  లేకుంటే - యధో కర్మహ తతో ఫలః " అన్న అర్థం వచ్చేలా !

సత్య కు తెలిసిన సత్యం అదే!

(సమాప్తం)