Tuesday, November 13, 2012

భళీ జిలేబీవళీ దీపావళీ !

శ్రీ రామచంద్ర ప్రభువు మళ్ళీ తల పట్టు కున్నాడు. అబ్బా తల నొప్పి అంటూ !

సీతమ్మ చూసింది.


'కుశ లవ్ కీ మా' అని సంబోధించాడు సీతనుద్దే శించి.

స్వామీ అన్నది అమ్మ వారు!

'తప్పైపోయి నిన్ను నేను ఒక్క సారి అడవులకి పంపి మరీ తప్పు చేసాను సుమీ ! జన్మ జన్మలకీ ఈ కారణం పట్టు కుని నన్ను శాంతి గా ఉండనివ్వ నంటున్నారు ఈ నరులు ' వాపోయాడు రామభద్రుడు. 'అవ్వా ళ ఆ మడవాలి మాట వినకుండా ఇప్పటి రాజకీయ నాయకుల్లా ఉండి 'వాడెవడో చస్తే నా కేంటంట అన్నట్టు ఉండి పోయి ఉండాల్సిం ది ' నిట్టూర్చాడు.

సీతమ్మ విచారం గా చూసింది.

పాపం స్వామీ వారు.

అడవులకి వెళ్ళిన తనే వగచ లేదు.

ఏమి జరిగిందో అది రాసి ఊరుకున్నాడు ఆ వాల్మీకి.

దాన్ని 'వినుడు, వినుడోయీ రామాయణ గాధ ' అని పుత్ర రత్నములు కూడా 'టాం టాం ' కొట్టేసేరు'!

అన్నీ కలిపి స్వామీ వారిని యుగ యుగ ములకీ వదిలి పెట్టె టట్టు లేదు మరి , వారి పై అభాండాలు !

'స్వామీ, బాధ పడకండి. దాన్ని 'కాంపెన్సేట్' చేయడానికే కదా,కృష్ణా వతారం లో మిమ్మల్ని కోరుకున్న వారినేవ్వరినీ మీరు కాదన లేదు ?" ముసి ముసి నవ్వులు చిందించింది అమ్మ వారు. ద్వాపర లో తన పరిణయం గుర్తు కొచ్చి మరీ సిగ్గు మొగ్గై పోయింది.

'ప్రాణే శ్వరీ , ఆ జన్మ మాత్రం ఆరోపణ లకి గురి కాలేదా ఈ మానవ మాత్రుల చేత ' మళ్ళీ వాపోయాడు రామచంద్రుడు.

'స్వామీ , అదియే కదా 'స్త్రీ' సిరి ! మీరు మమ్మల్ని ఏడిపించినా , మేము మిమ్మల్ని ఏడి పించినా , కాల గతి లో మీ పైకే ఆరోపణ లన్నీ వస్తాయి ' ఈ మారు అమ్మవారు మరీ ఆలోచించి చెప్పంది .

'ఎందు కంటావ్ ? ' అన్నట్టు చూసాడు భోళా రాముల వారు.

'ఏ కాలం లో నైనా ఓ మగ వాడు , ఓ స్త్రీని తక్కువ గా చెప్పి ఇంటి కెళ్ళి బతికి బట్ట కడతా డంటారా వాడికి తిండి ఇంట ఆ ఇల్లాలు పెడు తుం దంటా రా ?' అడిగింది సీతమ్మ.

' అవునోయ్, ఈ విషయం నాకు తట్ట లేదు సుమీ!

"ప్చ్ ఆ మానవుడికి ఇంట్లో తెల్లారి టిఫిను పెట్టలేదేమో వాళ్ళావిడ! కొంత ఆవిణ్ణి ఖుషీ చెయ్యడా నికి ఇట్లా చెప్పి ఇంటి కెళ్ళి ఉంటాడు, కనీసం 'చారన్నమైనా' దొరక్క పోదా అనుకుంటూ ' "

శ్రీ రాముడి ముఖం తేట బడింది. చింత వదిలింది.

'సీతమ్మ గుంభన గా నవ్వింది. ' ఈ మగ రాయుళ్ళ 'దిమాగ్' ఇట్లా గడ్డి పోచలా ఉంటుందెందుకో మరి ! ఓ నిమిషం లో డీలా పడి పోతారు. మరో నిమిషం లో శ్రీ మతి కొంత ఊరట కలిగిస్తే మళ్ళీ మన లోకం లోకి పడతారు !'

అంతా విష్ణు మాయ మరి !


దీపావళీ శుభాకాంక్షల తో -

యా దేవీ సర్వ భూతేషు ... ఇవ్వాళే 'మా సత్య' శ్రీ కృష్ణుని సాక్షి గా నరకాసురుడి సంహారం గావిం చిందట !

శుభోదయం !
భళీ !!
జిలేబీవళీ !!!

Thursday, June 7, 2012

ఈ శుక్ర గ్రహ అంతర్యానం  సూర్యుని ఫోటో లోని ముఖం ఎవరిది ?

నిశితం గా గమనిస్తే మీకు ఒక తాత గారి ముఖం ఈ సూరీడి ఫోటో లో కనిపిస్తోంది. ఎవరిదీ ముఖం? సూరీడి దా ?

Sunday, April 1, 2012

శ్రీ రామ నవమి శుభాకాంక్షల తో - సీతా కల్యాణం -1

శ్రీ రామ హరే రామ !

శ్రీ కాంతో మాతురో యస్య జనని
సర్వ మంగళా జనకః శంకరో దేవః
తం వందే కున్జరాననం

జయతి మరకతా భవ్య త్పరం వస్తు సత్యం
నిఖిల నిగమ మ్రుడ్యం రామ నామ్న ప్రతీతం
భవ జలధి నిమగ్న ప్రాణి నౌకాయ మానం
భవతు మమ గతిహి తత్ బాలక్రిష్ణాపి వేద్యం

రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేదసే
రఘునాథాయ నాధాయా సీతాయః  పతయే నమః

బుద్ధిర్బలం యశో ధైర్యం
నిర్భయత్వం  అ రోగతాం
అజాడ్యం వాక్ పటుత్వం చ
హనూమత్ స్మరణాత్ భవేత్


 శ్రీ రామ శరణం మమ శ్రీ కృష్ణ శరణం మమ
స్వస్త్యస్తూ సమస్త సం మంగళాని సంతు
సమస్త ఐశ్వర్య ప్రాప్తి రస్తు

శ్రీమద్ రామాయణే బాల కాండే సీతా రామ వివాహ ఘట్టే
శ్రీ త్యాగరాజ ముఖేన అధ్య వర్తమాన కథా ప్రసంగః

+++++++

రాగ రత్న మాలిక చే రంజిల్లున ట హరి సదా
బాగ సేవించి సకల భాగ్యముల మందు దము రారే !

++++++++

ఈ నవ రాత్రి లో -
నవ రాత్రి అంటే మీ కందరికీ తెలుసు -
తొమ్మిది రాత్రులు -
నవ రాత్రి అంటే తొమ్మిది రాత్రులని తెలవడం కన్నా మనం  ఇంట్లో బొమ్మల కొలువు పెడతామన్నది అందరికీ తెలుసు


 ఇది ఎవరికైనా తెలియక పోతుందేమో నని ఇక్కడ బొమ్మలే  కొలువే పెట్టి ఉన్నారు -

ఈ కొలువు పెట్టడడం స్త్రీ లకి , అమ్మాయిలకి పిల్లలకి చాల ఇష్టమైన విషయం 
కొలువు పెట్టడం ఎక్కడైనా పురాణం లో చెప్ప బడి ఉందా, లేక శాస్త్రం లో చెప్ప బడి ఉందా ?
కొలువు పెట్టక  పొతే ఏమి ?


గమనించాల్సిన విషయం ఏమిటంటే శాస్త్రం లో ఏది చెప్ప బడలేదో, అదంతా తూచా తప్పకుండా చేస్తున్నాం
ఏదైతే శాస్త్రం లో చెప్పారో అదంతా వదిలేసాం

శాస్త్రం లో ఏదైతే చెప్ప బడలేదో దీపావళి - దాన్ని బ్రహ్మాండం గా పటాటోపం  తో కొనియాడుతాం
అట్లాగే ఈ కొలువు పెట్టడం కూడా ఒక ఆనవాయితీ అయిపొయింది.
కొలువు పెట్టడానికి ఒక తాత్పర్యం ఉంది. ఆ భావనతో పెడతారేమో తెలియదు.


అంబ కొలువై ఉంది.  అంబ ఎలా ఉందంటే - తాను నిశ్చలం గా ఉంది , లోకాన్ని నడుపుతోంది. తాను నిశ్చలం గా ఉండడం తో , లోకం లో ఎన్ని మార్పులు జరుగుతూన్న తన దగ్గిరికి అవి రావు.  అట్లా అన్నింటికీ ఆవల ఉన్న అంబ - సర్వ చైతన్య రూపాన్తాం ఆద్యాం విద్యాం చ ధీమహీ బుద్ధిం  ధ్యాన ప్రచోదయాత్ - ఇది అంబ స్వరూపం.
అట్లా చైతన్య రూపిణి ఐన అంబ సర్వ జీవ రాసులలోనూ ఉంటోంది కదా ?  సృష్టి లో వివిధ రూపాలలో ఈ అంబ ఉండడం తో వాటి కి ప్రతీకగా ఇలా మనం బొమ్మల కొలువు పెడుతున్నాం  కొలువు పెట్టడం లో కూడా ఒక పద్దతి ఉంది. ఎవరెవర్ని , ఎవరెవరితో , ఎ   మెట్లమీద పెట్టాలో దానికని ఒక పధ్ధతి ఉంది.
కొలువులో ఒక శ్రేష్టి బొమ్మ పెడితే ఆతనికి సంబంధించిన వాటిని ఆ బొమ్మ ప్రక్క పెడితే అది లక్షణం గా ఉంటుంది.  అలా కాకుండా శ్రేష్టి గారి పక్కన పులి బొమ్మని పెడితే బాగుంటుందా ? కాబట్టి ఎవరి తో ఎవరు కలసి  ఉండాలో అన్న తాత్పర్యాన్ని ఇది తెలుపుతుంది.  వీటిన్నటికి ఎట్లాంటి ఆధారాలు లేవు.
అంబ కొలువై ఉంది. ఎక్కడ ? మన మనసులో. మన జీవం లో.  ప్రతి రోజు అభివృద్ధి చెందుతోంది.
శారదా నవరాత్రి , వసంత రాత్రి అని రెండు నవరాత్రులు.
వసంత రుతువు , శరద్ ఋతువు, రెండు ఋతువులు.

మనకి ఋతువుల పేర్లే తెలియకుండా పోతుందేమో ?
అసలు ఈ ఊళ్ళో పంచాంగం ఉందా అంటే సందేహమే . చాలా మంది ఇంట్లో ఉండక పోవచ్చనుకుంటా ఎవరైనా ఒకరిద్దరి ఇంట్లో ఉంటె  గింటే వారు దాన్ని చూస్తారా అన్నదీ సందేహమే !
వసంత రుతువు - చైత్ర వైశాఖం
మన పిల్లలకి పెద్దలైన మీరే నేర్పాలి
ఇంతకు మునుపే ఇక్కడ ఒకరి తో నేను చెప్పాను. - మన కల్చర్, హెరిటేజ్ ఇవన్ని ధ్యాసతో కాపాడుకోవాలని తపన , మన అమెరిక నించి వచ్చిన భారతీయుల వద్ద ఎక్కువగా చూడొచ్చు. ఇది నేను చూసిన విషయం. వాళ్ళ దగ్గిర శ్రద్ధ ఉంది. సంస్కృతం నేర్చుకుంటున్నారు. చికాగో వెళ్ళినప్పుడు , ఒక చిన్న పిల్లవాడు రుద్రం, చమకం చెప్పడం విని సంతోషం చెందిన వాణ్ని.
మన ఇంట్లో పిల్లలైతే రుద్రమా , చమకమా అదేంటి అంటున్నారు.  ఒకసారి చంద్ర శేఖర స్వామీ వారి వద్ద వెళ్లి , ఆచార్యుల వారి వద్ద వెళ్లి - ' మన ఈ తరం అసలు సంధ్యావందనం చెయ్యటం లేదు. మీరు ఒక ఆర్డర్ ఇవ్వాలి - అందరూ సంధ్యావందనం చెయ్యాలని ' అన్నాను. దానికాయన అడిగారు - ఏమిటండి - మీ అబ్బాయి ధోతి అయినా కడుతాడా? "  అసలు ధోతి అయినా కడుతున్నాడా? అదీ ప్రశ్న ! 
మన సంప్రదాయానికి ఈడైనది ఏది ఉంది? మన సంప్రదాయం మనిషి గొప్పతనాన్ని పెంపొందింప చేస్తుంది. మిగిలిన వన్నీ , అసురత్వాన్ని పెంపొందించేవి.

ఒక నెలగా నేనిక్కడ ఉంటున్నాను. మధ్యాహ్న వేళలో టీవీ చూస్తున్నాను. మధ్యాహ్న సమయం లో నాకేం పనీ పాటా లేదు. - "What are you doing? " అని ఎవరైనా అడిగితె - తటాల్మని నా సమాధానం - " I watch TV" !

ఏముంది టీవీ లో? చెప్పిందే చెబ్తున్నాడు. పెట్టిన ప్రోగ్రాం మళ్ళీ మళ్ళీ అదే పెడ్తున్నాడు.  మధ్యలో నాకు advertisement కి  కథకి వ్యత్యాసం తెలియకుండా పోతోంది.  పోనీ advertisement ఏదైనా వెరైటీ గా ఉందా అంటే అదీ లేదు. ఈయన టీవీ లో పని చేస్తున్నారు. తప్పుగా ఏమైనా అనుకో బోతారు.  టీవీ  లో తిప్పి తిప్పి తినే సామన్లనే చూపిస్తున్నాడు.

అందువల్ల నేననుకున్దేమంటే - ఈ అమెరికా వాళ్ళు , మంచి ' భోక్తలు ' - మంచి తిండి తినే వారు కామోసు అని ! .  ఇవన్ని అసుర ప్రాయం , రాక్షస ప్రాయం - ఇవన్నీ చెప్పాల్సిన పనే లేదు. వీటిని నేర్పటానికి ఎ లాంటి బళ్ళూ అవసరం లేదు. ఒక తప్పు కార్యాన్ని చెయ్యడాని కి ఎవరు నేర్పించనక్కర్లేదు.

సులభః  పురుషః  రాజన్  సతతం   ప్రియవాదినః
అప్రియస్య   తు  పత్యస్య  వక్తా  శ్రోతా  చ  దుర్లభః
 
మంచి విషయాన్ని చెప్పేవారు లేరు, చెప్పినా వినే వాళ్ళు లేరు  - మంచి విషయాన్ని ఎవరైనా చెప్పినా ఎవరు వినరు. వారు వినరు కాబట్టి వీళ్ళూ , మనకేంటి అని చెప్పడం మానుకుంటారు.
 
'How is your son sir? "
 
వాడి కేమండి - "I give him full freedom "


full freedom ! అలా చెప్పే మనం మాట దాటేయ్యాలి వేరే మార్గం లేదు.

సులభః పురుషః రాజన్ సతతం ప్రియవాదినః
అప్రియస్య తు పత్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః

మనం ఆహ్లాదం గా నవ్వుకోటానికి, మనకి ఇంపైన మాటలనే చెప్పడానికి చాల మంది ఉంటారు. ఇది చెయ్యొద్దని చెప్పే వాళ్ళు లేరే లేరంటారు.
కాబట్టి మనకి ధర్మం అంటే ఏమిటని చెప్పే వాళ్లైనా ఉండాలి.
ఓయ్ - ఇది అటామిక్ ఏజ్ , నూక్లియర్ ఏజ్ - ఈ ఏజ్ లో ఇట్లాంటి చాందస భావలేమిటి? మడేమిటి ? ఆచారం ఏమిటి? పుణ్యం ఏమిటి? పాపం ఏమిటి?  అని ఒకాయన నన్నడిగారు. ఇప్పుడు తెలవదండీ మీకు వీటి గురించి. ఎవడైనా రిసెర్చ్ చేసి వాటి గురించి చెబ్తాడు. అప్పడు మీరు నమ్మక తప్పదు. సైంటిఫిక్ రిసెర్చ్ చేసి ప్రతి దానికి వాళ్ళు కారణం చెబ్తున్నారు.  రాబోయే  కాలం లో అట్లా ఎవరైనా రిసెర్చ్ చేసి కారణాలు చెబితే,  మన  ఇండియా దేశంలో ఇవన్ని ఉండే వంటా అని తెలియకుండా పోతుందేమో ?

ఇప్పుడు నేనివన్నీ  చెప్పినంత మాత్రాన ఎవరైనా వెంటనే చేస్తారంటార?  అయినా మన లని మనం కొంతలో కొంత మంచి వైపు మళ్ళించు కోవచ్చు గదా?  మనలో నే ఒక నిర్ణయం, ఒక నిబద్ధత , ఒక discipline' తెచ్చుకోవచ్చు గదా ? ఇట్లా మనల్ని మనమే ఒక మంచి దారి లో మళ్ళించు కోవచ్చు కదా. ?

త్యాగరాజ స్వామీ వారి గొప్పదనం అదే . ఎంత గొప్పవాడై ఉండ వచ్చు ఆయన? ఎంత పెద్ద చక్రవర్తి ఐ ఉండ వచ్చు  ఆయన? ఎందఱో ఆయన కాళ్ళ మీద పడ్డారు.  ఆయన దేనికి తల వొంగలేదు. ఆఖరి దాక నిరుపేద గా నే ఉండి తనువు చాలించాడు. ఆయనకి ఎట్లాంటి ప్రాపర్టీ లూ లేవు. మాన్యాలు కొనుక్కొని ఉండ  కూడదా?
ఎంతో మంది గుళ్ళకి ట్రస్టీ లు గా ఉంటూ మడులు మాన్యాలు వెనకేసుకున్నారు. పెద్ద పెద్ద గుళ్ళకి ట్రస్టీ లవడానికి ఎలెక్షన్ లో పోటీ పడి గెలిచి పదవి లో ఐదేళ్ళు ఉండి అలా రాగానే - ఆయనకేమండి  భూములు , ఇండ్లూ కొనుక్కొని ఉన్నాడు. డబ్బెక్కడి దండి ? గుటకాయ స్వాహా !  మీ దేశం లో ఉండదనుకుంటా. నేను చెబ్తున్నది ఇండియా గురించి. ఈ దేశం గురించి, అమెరికా గురించి చెప్పడానికి నా కేమి అర్హత ఉందీ ? ఇండియా గురించే చెబ్తున్నా.

ఇట్లా తప్పిన మార్గం లో ధన సంపాదన చేసుకుంటూ భేషుగా ఉంటున్న వాళ్ళు ఎంత మంది లేరు? ఇట్లా  త్యాగరాజ స్వామి చేసి ఉండ వచ్చుకదా? ఆయనికి అట్లాంటి అవకాశాలెన్నో వచ్చేయి. ఆయన చేసారా? చెయ్యడాయన. కారణం ఏమిటి? వీటన్ని టికి పై పడ్డ ధర్మం ఆయన వద్ద ఉంది.

ఎ పనికో రామా
జన్మించితి నని ఎంచవలయు శ్రీ రామ


రాముడినే అడుగుతున్నాడు. - ఎ పనికో రామ నను జన్మించితివి? ఎ కారణం కోసం నేను జన్మించాను?  నే నెందుకు  కు జన్మించాను. ?
మనలో ఎవరైనా అడుగుతామా? అట్లా ప్రశ్నించిన వారొక్కరే -రమణ మహర్షి - "who am I" అని ప్రశ్నించు కున్నా డాయన. వేరే వాళ్ళని అడగ లేదు ఆయన. తనలో తనే ప్రశ్నించు కున్నాడు. దానికి ఆయనకి సమాధానం దొరికింది.

ఎ పనికో రామా
జన్మించితి నని ఎంచవలయు శ్రీ రామ


----Shree TS Balakrishna Sastri గారి తమిళ హరికథ కాలక్షేపానికి తెలుగు అనువాదం - by

జిలేబి.

Sunday, February 19, 2012

బుజ్జి పండు తెలుగు చదువు - భామా విజయం

ఫ్రాన్క్ఫర్టు అంతర్జాతీయ విమానాశ్రయం. టెర్మినల్ ఒకటి. తెల తెల వారి పోతోంది. బయట మంచు తెల్లటి తివాచీ లా పరుచుకొని వుంది. మత్తుగా 'సోనెన్' కిరణాలు మంచు పై పడి మధుర వేణువులు పలికిస్తున్నాయి కమ్మ తెమ్మర తోడు రాగా.


"హల్లో బుజ్జి పండూ, ఐ యాం బులుసు " అన్న మాటలు వినిపించి బుజ్జి పండు చదువుతూన్న 'విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు' పుస్తకాన్నించి బయటపడి తలెత్తి చూసాడు తన హారీ పాటర్ కళ్ళద్దాల లోంచి.
అరవై ఏళ్ల పై బడ్డ మనిషైనా చలాకీగా కనబడుతున్నాడు ఓ పెద్దాయన.

కంటికి జోడు కళ్ళద్దాలు. ఫుల్ సూటు.
కాళ్ళకి సాక్స్ మీద హవాయి చెప్పులు .
చేతిలో సిగారు.
మరో చేతిలో చిన్ని బ్రీఫ్ కేసు.
పెదవుల పై ము.ము.న.




ఫక్కున నవ్వు వచ్చేసింది బుజ్జి పండు కి ఈ పెద్దమనిషి ని చూస్తూనే ! అసలు పేరు చెబ్తేనే జనాల పెదవుల మీద చి.న. రాగా లేనిది , ఆ పెద్దాయన ని కంటి ఎదుటే వున్నాడు, అదీ తనను తాను పరిచయం చేసుకుంటూ.

వీరి ఇద్దరి మధ్యా ఈ మీటింగు ఫ్రాన్కఫర్టు విమానాశ్రయం లో జరగటానికి కారణం ఏమిటి? దీని వెనుక ఎవరి ప్రోద్బలం వున్నది అన్నది తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజుల మునుపు వెళ్ళాలి.

కొన్ని రోజుల మునుపు....

జర్మేనీ మ్యూనిచ్ మహానగరం. శ్రీ కృష్ణుల వారి మీద రీసెర్చ్ లో తలమునకలయ్యే పనుల్లో కూరుకు పోయి, బ్లాగులో ఇవ్వాళ ఏమి రాయాలో అన్న మధుర ఆలోచనల లో నిమగ్నమైన మధురవాణీ గారికి ఇండియా నించి ఫోన్ వచ్చింది.

" హాయ్, మధురా, కృష్ణ ప్రియని "

"ఊ "

"బులుసు వారు ఐరోపా వస్తున్నారు "

"ఊహూ"

"నీ హెల్ప్ కావాలి "

"ఊ"

"మా ఆర్ముగం పారీసు లో వున్నాడు. తన్ని ముఖాముఖి చెయ్యడానికి బులుసు వారు ఐరోపా వస్తున్నారు. డైరెక్ట్ గా పారీస్ కి వారికి కుదరలేదు. మధ్యలో ఫ్రాంక్ఫర్ట్ హాల్ట్ అక్కడ్నించి వెళ్ళాలి "

ఇప్పటికి మధుర మళ్ళీ భువి పై మ్యూనిచ్ నగరానికి , మన లోకానికి వచ్చింది, ఊ, ఊహూ ల మధ్యనించి బయట పడి.

"కృష్ణా నీవేనా ! నీవేనా నను పిలచినది ! " అని , మళ్ళీ 'ఊ' హా' లోకం లోకి జారుకోబోయి, పిలిచింది కో-బ్లాగిణి కృష్ణ ప్రియ అని గుర్తుకు వచ్చి,

"ఏమన్నావ్, ఏమన్నావ్, మళ్ళీ ఇంకో మారు చెప్పవూ " అంది మధుర.

ఈ మారు కృష్ణ ప్రియ తల పట్టుకుని, 'మధుర వాణీ , అని పేరు పెట్టుకున్నావ్ కాబట్టి నీకు అన్నీ రెండేసి మార్లు చెప్పాలే సుమా , అని మళ్ళీ మొదట్నించి మొదలెట్టింది.

అప్పటికి మధుర వాణీ, బుర్రలో వెలిగింది , వస్తున్నావారు ఎవరు అన్నది.

బులుసు గారు వస్తున్నారోచ్ ! అన్న వార్త వినగానే, మధుర ఆనందం ఇంతై వటుడింతై అన్నట్టు ఆకాశానికి అంతే లేదన్నట్టు అయ్యింది.

"బులుసు గార్ని నువ్వు ఫ్రాంక్ఫర్ట్ లో కలిసి అక్కడ్నించి వారిని నువ్వు ఐ సి ఈ ట్రైన్ లో పారీస్ కి అకంపనీ అవుతావా? " అంది కృష్ణ ప్రియ.

"కుదరదు. వార్నీ మ్యూనిచ్ కి లాక్కోచ్చేస్తాను. ఆపై ఓన్లీ పారీస్ " అని ప్లాన్ మార్చమంది మధుర వాణీ.

ఈ కొత్త ట్విస్ట్ తో కృష్ణ ప్రియ సరే నాకు కొన్ని గంటలు టైం ఇవ్వు అని నాలుగైదు కాల్స్, చాట్,మెయిల్ ' బులుసు వారికి నడిపి మొత్తం మీద కొత్త ప్లాన్ కి నాంది పలికింది. బులుసు వారిని ఫ్రాంక్ఫర్ట్ ఏర్పోర్ట్ నించి మధుర పిక్ అప్ చేసుకుని మ్యూనిచ్ వెళ్తుంది అక్కడ కొన్ని రోజుల బస తరువాత బులుసు గారు పారీసు వెళ్తారని.

ఈ సంఘటన జరిగిన రెండో రోజులకి మధుర వాణీ కి మరో ఫోన్ - ఈ మారు అమెరికా నించి - జ్యోతిర్ మాయీ వారి దగ్గిర్నించి. "మధురా, మా బుడతడు, తెలుగు చదువు ముగించి, అమెరికా వస్తున్నాడు. మధ్యలో ఫ్రాంక్ఫర్ట్ లో ఫ్లైట్
లే ఓవర్ లో వుంటాడు. కలుస్తావా అతన్నీ ? " అని.

"బుజ్జి పండుమని కలవమని రిక్వెస్ట్ చెయ్యవలెనా జ్యోతిర్, జస్ట్ ఆర్డర్ ఇవ్వండీ, " అని మధుర చెప్పి, ఎప్పుడు వస్తున్నాడు అంటే, బుజ్జి పండు రాక, బులుసు గారి రాక ఒకే రోజున అని తేలింది.

"బుజ్జి పండుని నేను మ్యూనిచ్ కి పిలుచుకెళ్ళనా ? "

"ఓహ్, నో, తను క్రిస్టమస్ కి అమెరికా లో వుండాలన్నాడు- కాబట్టి కుదరదు" జ్యోతిర్మయి చెప్పారు.

"ఓహ్, ఐతే , నాకూ కుదరదే " అని " వీలయితే చూస్తాను " అని చెప్పి, మనసులో, బుజ్జి పండు ని కిడ్ నాప్ చెయ్యడానికి ప్లాన్ తయారు చేసుకున్నారు మధుర వాణి.

దాని పర్యవసానం ఈ బులుసుగారి 'హల్లో బుజ్జి పండు ఐ యాం బులుసు " అన్న ఈ మాటలు.


*****



మ్యూనిక్ మహానగరం.

ఓ అమ్మాయి చూడడానికి ఇండియన్ లా వుంది.


చలి విపరతీం గా ఉండటం తో మెడ చుట్టూ మఫ్లర్ , తలకి స్కార్ఫ్.

రిసెర్చ్ సెంటర్ నించి బయటకు వచ్చి రిస్ట్ వాచ్ లో టైం చూసుకుని తన కారు ఎక్కి డాష్ బోర్డ్ పై వున్న శ్రీ కృష్ణ స్వాముల వారి ఫోటో కి ఓ నమస్కారం సమర్పించుకుని కార్ ని ఫ్రాంక్ఫర్ట్ నగరం వైపు కి వెళ్ళడానికి ఉత్తరం వైపు తిప్పి ఆటో బాన్ ఎ నైన్ ఎగ్జిట్ వైపు సాగించింది.




శ్రీ కృష్ణ స్వాముల వారి పై అమితానురాగాలతో రీసెర్చ్ చేసే మన మధురవాణి గారు ఈవిడే నని నేను వేరు గా చెప్పనక్కర్లేదనుకుంటా !

దాదాపు నాలుగు వందల కిమీ పై చిలుకు ప్రయాణం. ఓ మోస్తరు నాలుగు గంటలలో ఫ్రాన్క్ఫర్టు చేరుకోవచ్చని తీరిగ్గా ఆలోచనలో పడింది మధుర.

బుజ్జి పండుని కిడ్ నాప్ చెయ్యాలి అనుకున్నది గాని, ఎలా చెయ్యాలో తెలియకుండా పోయింది. ఆ ఐడియా వచ్చినప్పటి నించి మధుర శ్రీ కృష్ణుల వారిని పిలుస్తోన్నే వుంది. స్వామీ నీవే ఏదైనా ఉపాయం చూడు అని.

ఎందుకో ఎప్పట్లా ఈ మారు స్వామి వారు పలకడం లేదు. వున్నారో లేదో అన్న సందేహం కూడా వస్తోంది తనకి. ఎప్పుడు పిలిచినా వెంటనే పలికే కన్నయ్య ఈ మారు ఎందుకో ఏమో తెలీదు అస్సలు పత్తా లేకుండా పోయాడు.

ప్రయాణం లో అలుపు తెలీకుండా 'ఘంటసాలవారి అష్టపది వింటూ 'తవ విరహే కేశవా ' కృష్ణా రాధికా కృష్ణా రాధికా అంటూ ఆటో బాన్ మీద రెండువందల కిలో మీటర్ వేగాన్ని కారు కి అందనిచ్చింది మధుర వాణి, కృష్ణా ఏమైనా ఉపాయం చెప్పవూ అంటూ.

ఊహూ, శ్రీకృష్ణుడు అస్సలు పత్తా లేదు.

హే కృష్ణా ముకుందా మురా ఆ ఆ రే .... అంటూ ఈ మారు ఘంటసాల వారి గొంతు ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తే , తాను ఆటో బాన్ మీద వెళ్తున్నాన్నదాన్ని మరిచి హే కృష్ణా అంటూ స్టీరింగ్ పై నించి రెండు చేతులూ వదలిసింది మధుర వాణి!

రష్యా లో కోర్టు కేసులో హాజరవుతూన్న శ్రీ కృష్ణుల వారు ఉలిక్కి పడి అక్కడ్నించి తటాలు న మాయ మయ్యారు, తన అడ్వొకేట్ అయిన రాజి కి మాట మాత్రం కూడా చెప్పకుండా , అడ్వొకేటు రాజి గారు కృష్ణా , వెళ్ళకు ఆగు, కేసు ఫైనల్ హియరింగ్ జరుగుతోంది అని గాబారా పడుతూ చెబ్తూంటే వినిపించుకుంటేనా స్వామీ వారు!



***



'అమ్మాయ్ , అమ్మాయ్ మధురా - నువ్వు ఆటో బాన్ లో వున్నావ్ , ఇట్లాంటి చేష్టలు ప్రాణ హానికరం' అంటూ సున్నితం గా సుతారమైన గొంతు ఈ మారు బాక్ సీట్ నించి విన రావడం తో ఉలిక్కి పడి ఈ లోకం లో కి వచ్చి మధుర రియర్ వ్యూ మిర్రర్ లో ఎవరా అని చూసింది.

నెమలి పించం , లలాట ఫలకే కస్తూరి తిలకం అంత దాకా శ్రీ కృష్ణుల వారిలా వున్న ఆ ఆకారం ... ఆ పై వేషం వేరుగా వుండి, కొటూ , సూటూ, కంఠం లో ముక్తా వళీ లా టై పడమటి కేళీ విలాసం లా గున్నాడా పెద్ద మనిషి. !

' స్వామీ ! ఇదేమి కొత్త వేషం ఈ మారు ? ' స్వామిని గాంచిన మహదానందం తో అడిగింది మధుర.

'ఏమని చెప్పనమ్మాయ్ మధురా! నేనెప్పుడో చాలా కాలం క్రితం మా అర్జునినికి గీత చెప్పాను. అది నా తలరాత లా అయిపోయింది.

రష్యా లో గీత కి చరమ గీతం పాడాలని కొందరు కోర్టు కి ఎక్కారట.


మా అర్జునుడు ఒకటే గొడవ, బావా నీవే వచ్చి దానికి వకాల్తా తీసుకోవాలి ! నీ గీతను నువ్వే కాపాడుకోవాలి అని వాడు చేతులెత్తేసాడు.

పోనీలే అని రష్యా కోర్టు కెళ్ళి అక్కడి తతం గం లో తలమునకలై వుంటే నీ 'గజేంద్ర' పిలుపు ఆర్తనాదం వినిపించి, ఆ కోర్టు కేసు వాళ్ళ తలరాతకి వదిలేసి, అలాగే వచ్చేసాను !

అబ్బ ఒక్కటే చలి ప్రదేశం అమ్మాయ్ ఈ రష్యా దేశం ! అంటూ కోటు ని మరీ దగ్గిరగా కప్పుకున్నారు శ్రీ కృష్ణ స్వాములవారు - "ఇంతకీ ఎందుకు నన్ను పిలిచినట్టు ?" అని అడుగుతూ.

'స్వామీ ! బుజ్జి పండు ఫ్రాంక్ఫర్ట్ ఇంటర్నేషనల్ ఏరియా లో వున్నాడు. అతన్ని ఎలా బయటకి రప్పించి నేను మ్యూనిచ్ తీసుకెళ్లాలో నాకు తెలియటం లేదు. నీవే నాకు మార్గం చూపెట్టాలి ' అని మొర పెట్టుకున్నది మధుర, మొత్తం కథని టూకీ గా వారికి చెప్పి.

'ఓస్, అమ్మాయ్, ఈ మాత్రం దానికి నేనెందుకు. ? నా ప్రియ బాంధవుడు బులుసు అక్కడే కదా వున్నాడు. ఆతడే చూసుకుంటాడు సుమా , వుండు ' అంటూ చేతిని తన హృదయం మీదికి పోనిచ్చారు శ్రీ కృష్ణుల వారు.

ఇక వస్తానమ్మాయ్! నీ కారు ఏర్పోర్ట్ చేరుతోంది, చూడూ, అక్కడ గెట్ ఎ ఒన్ దగ్గిర బులుసు వారు పక్కనే బుజ్జి పండు వున్నారు గమనించు . ఇక నే మళ్ళీ రష్యా వెళ్తా ' అని కృష్ణ స్వాములవారు అంతర్ధానమయ్యారు !

ఆటో బాన్ నించి సుమారు మూడు వందల కిమీ దూరం లో వున్న ఏర్పోర్ట్ ముందర ఆగింది ఈ మారు మధుర వాణి కారు "augenblick" సమయం లో ! అంతా శ్రీ కృష్ణుల వారి మాయ ! గెట్ ఎ ఒన్ దగ్గిర బులుసు గారు, పక్కనే బుజ్జి పండు కనపడ్డారు మధుర వాణికి!

"Vielen Dank Krishna" అంటూ మధుర వాణి సంతోషం తో అమందానందకళిత హృదయారవిందురాలై కారు దిగి, బులుసు వారికెదురేగి 'నమస్తే' మాష్టారు ' అంటూ చెప్పి, బుజ్జి పండు వైపు తిరిగి 'హాయ్ బుజ్జి పండు' అంది మధుర.

బుజ్జి పండు బులుసు వారి వైపు తిరిగి ఎవరన్నట్టు చూసాడు ఈ మారు.

'మై డియర్ బాయ్, మీట్ 'ఊ , ఊహూ మధుర' అని బుజ్జి పండు కి పరిచయం చేసారు మధురని బులుసు వారు.

'ఓమ్ నమో మాతా నమో నమః' అనబోయి బుజ్జి పండు తాను జర్మేని లో వున్నానని గుర్తుకొచ్చి, "Wie gehts frau madhura " అన్నాడు.

"Good Dank! und du" మధుర చెప్పింది బుజ్జి పండు జర్మన్ ఆక్సేంట్ కి అబ్బురపడి.

"Vielen good, Dank! ' బుజ్జి పండు చెప్పాడు నవ్వుతూ - "మా స్కూల్లో జర్మన్ సెకండ్ లేన్గ్వేజీ నాకు ". ఆతని హరీ పాటర్ కళ్ళద్దాలలోంచి చమక్కుమని ఒక మెరుపు మెరిసి తెల్లటి తివాచీలా వున్న మంచు పై రిఫ్లెక్ట్ అయింది.

"Alles klaar, das ist schon" అంటూ మధుర సంతోష పడి వారిద్దర్నీ అక్కడి దగ్గిరే వున్న స్టార్ బక్స్ కి తీసుకెళ్ళింది కొంత రెఫ్రెష్ అవడానికి.

కొంత సేపటి తరువాయి, ఆ ముగ్గురు వున్న మధుర కారు మ్యూనిక్ వైపు పరుగులేట్టింది. . బులుసు కాలికి నిగ నిగ లాడే కొత్త బూట్లు ఆ కారు కలర్ కి కామ్పీట్ చేశాయి ఈ మారు !
*****

"ఏమమ్మా మధురా ! మీ దేశం లో జనాలు మాట్లాడనే మాట్లాడరా?! ఇంత నిశ్శబ్దం గా వున్నావు "

అంటూ వందా యాభై కిలోమీటర్ల పైబడ్డ వేగం తో వెళుతున్న
'నిశ్శబ్దమైన ' కారు లో బులుసు గారు మొదటి మారు నోరు విప్పారు ఆ సైలెన్స్ కి భయపడి.

శ్రీ కృష్ణుల వారికి నమో నమః నమో నమః అంటూ కోటి మొక్కులు తెలియ చేసుకుంటున్న మధుర ఉలిక్కి పడింది.

జర్మనీ దేశం లో హటాత్తు గా ఎవరైనా తప్పి పలకరిస్తే వచ్చే మొదటి రిఎక్షన్ అది.



"అమ్మాయ్ , నీ అనుమతి లేకుండా ఈ బుజ్జి పండు ని కూడా నాతో వచ్చేయమని లాక్కోచ్చేసాను. తనకి అమెరికన్ పాస్పోర్ట్ వుండటం తో ఎగ్జిట్ కి ఎ ప్రాబ్లం లేకుండా పోయింది. నీకేమీ సమస్య లేదు కదా ?" అడిగారు బులుసు గారు.

రోగి కోరిన మందే వైద్యుడిస్తే ఎవరన్నా వద్దంటారా ?

"మాష్టారు ! మీరు బుజ్జి పండుని బయటకు తీసుకు రావడానికి కారణం బుజ్జి పండు అమెరికన్ పాస్స్పోర్ట్ కానే కాదు ! " చెప్పింది మధుర రియర్ వ్యూ మిర్రర్ లో చూస్తూ.

"మరి?"

"మా శ్రీ కృష్ణుల వారే ! " తన్మయత్వం తో కనులు మూసుకుంటూ చెప్పింది. వెనక వొస్తున్న కారు వాడు 'పాం' అంటూ సైడు తీసుకుని ఓ సీరియస్ ముఖం పెట్టి వెళ్ళాడు.

" శ్రీ కృష్ణుల వారంటే ఎవరు మధురా ? నీకు తెలిసన కస్టమ్స్ ఆఫీసరా ?" ఇండియా లో లాగా ఇక్కడ కూడా సిఫారుస్లు చెల్లుతాఎమో అని సందేహం గా అడిగారు బులుసు వారు.

"కాదండీ సాక్షాత్తు శ్రీ కృష్ణుల వారే ! రాధికా కృష్ణుల వారే "

మధుర జవాబు విని బులుసు గారు సీరియస్ గా చూసారు ఈ మారు మధుర వైపు. ఈ అమ్మాయి కి బ్లాగుల్లోనే శ్రీ కృష్ణుల వారి పైత్యం అనుకుంటే నిజంగానే శ్రీ కృష్ణులవారి వల్ల బుజ్జి పండు ఎగ్జిట్ అయ్యాడు అంటూ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్దేమిటి ? అని కొంత సందేహం గా చూసారు మధుర వైపు వారు.

"బుజ్జీ , నీ పాస్స్పోర్ట్ అమెరికన్ పాస్? " మధుర నవ్వుతూ అడిగింది.

మధుర పక్క సీట్ లోనే కూర్చుని జర్మనీ ఆటోబాన్ ని శ్రద్ధ గా గమనిస్తున్న బుజ్జి పండు తలని అడ్డం గా ఊపి, "కాదండీ ఫ్రౌ మధుర గారు , నాది ఇండియన్ పాస్స్పోర్టే నండీ " అన్నాడు !

ఈ మారు ఆశ్చర్య పోవడం బులుసు గారి వంతయ్యంది. అక్కడ ఇంటర్నేషనల్ ఎగ్జిట్ లో ఆ పాస్స్పోర్ట్ ఆఫీసరు అమెరికన్ పాస్స్పోర్ట్ ఉందనే కదా బుజ్జి పండుని ఎగ్జిట్ కానిచ్చాడు అని బుర్ర గోక్కున్నారు వారు.

జరిగినది మొత్తం టూకీ గా మధుర చెప్పింది బులుసు గారికి. శ్రీ కృష్ణులవారి వల్లే బుజ్జి ఎగ్జిట్ కానివ్వటం జరిగిందని.

"ఈ కాలం పిల్లలు ప్రాక్టికల్ జోక్ వెయ్యడం లో సిద్ధహస్తులు " అనుకుని వారు "బుజ్జీ నీ పాస్పోర్ట్ చూపించు" అన్నారు సందేహం తో బుజ్జి పండు వైపు చూస్తూ.

బుజ్జి పండు పాస్స్ పోర్ట్ చూపించాడు. అది వారికి అక్షరాల అమెరికన్ పాస్స్పోర్ట్ లానే వుంది, పక్షి రాజు అలంకృతమై !

" మాష్టారు మీరు నమ్మరు కదా ? "

"నమ్మక పొవట మన్న ప్రశ్నే లేదు అంత ఖచ్చితం గా పక్షి రాజు కనబడు తూంటేను !"

"పోనీ మీ కాళ్ళ వైపో మారు చూడండీ "

"అదేమిటో నమ్మాయ్, ఇండియా లాగా ఫ్రీ గా చెప్పులతో వచ్చేసాను ఇక్కడి చలికి కాళ్ళు తిమ్మి రెక్కుతున్నాయి " తన కాలి వైపు చూస్తూ అన్నారు బులుసు వారు.

బులుసు వారు కాళ్ళ వైపు చూసి ముక్కు పై వేలేసుకుని తన కాళ్ళకి అంత మాంచి బూట్లు వేసుకుని ఈ పెద్దాయన చెప్పులు అంటారేమిటీ అని ఆశ్చర్య పోయింది మదుర ఈ మారు.

"అదేమిటండీ బులుసు వారు, అంత తళ తళ లాడే బూట్లేసుకుని చెప్పులు అంటారేమిటీ ?"

"దునియా పాగల్ హాయ్ , యా ఫిర్ మై దీవానా " అన్న పాత పాట గుర్తుకొచ్చింది వారికి. !!

బుజ్జి పండు బ్లాక్ పాస్ పోర్ట్ నించి మూడు సింహాలు ముసి ముసి గా నవ్వు కున్నేయి అశోకుని కాలం ముందు నించే భారత దేశం లో శ్రీ కృష్ణుల వారి మాయలు చూసిన సింహాలు అవి మరి !

కారు మ్యూనిక్ నగరం కొనిగ్ స్త్రాస్సే పద కొండు నెంబర్ ఇంటి ముందు స్లో గా పార్కింగ్ స్లాట్ లో కొచ్చింది ఆటో బాన్ నించి మాయమై ఈ మారు!

*****



"సో యువర్ ఆనర్," అడ్వొకేటు రాజీ గారు గొంతు సవరించుకున్నారు.

తిరుప్పావై మొదటి పాశురం వారికి గుర్తుకొచ్చింది.
"నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్."




నందుని అనుంగుబిడ్డ, నీలమేఘశ్యాముడు, పద్మనేత్రుడు యశోదముద్దుపట్టి, బాల కిశోరం చెప్పిన గీత కి ఈవాళ ఇక్కడ బహిష్కారమా కాదా అన్న వీరి కేసుకి శ్రీ కృష్ణుడు తనని ప్రెసెంట్ చేయమనడం తన పూర్వ జన్మ సుకృతం !

శ్రీ కృష్ణుల వారు చిద్విలాసం గా రాజీ గారిని గమనిస్తున్నారు. ఈ అమ్మాయిని తను అడ్వొకేటు గా ఉండమనడం ఈ అమ్మాయికి సొబగైన వ్యవసాయం ఐనది. తన భగవద్గీత ని క్షుణ్ణం గా ఇంకో మారు చదివి మరీ ఇక్కడి కి వచ్చింది -

ఈ కేసు దెబ్బతో చదివని వాడు గూడా జాడ్యం వదిలించుకుని తా జెప్పిన గీతలో ఏముందో అన్న క్యూరియాసిటీ తో చదువు తాడేమో రాబోయే కాలం లో.

అయినా ఆ కాలం లో అర్జునుడే చాలా కష్ట పడ్డాడు తాను చెప్పిన గీత ని అర్థం చేసుకోలేక.

కాలం మారింది. మనిషి కూడా చాల విజ్ఞాన వంతుడయ్యాడు. కాబట్టి ఒక వేళ క్షుణ్ణం గా చదివితే ఈ కాలం లో అర్థం చేసుకుంటాడేమో ! చూద్దాం ఈ రాజీ ఏమని వాదిస్తుందో ? కేసు గెలిస్తే ఏమి ఓడితే ఏమి ? తాను చెప్పాల్సింది చెప్పేసాడు. "Whether some body takes it or not its their Karma!"

రాజీ 'ఘనమైన కోర్టు వాళ్ళని చూసింది.

"యువర్ ఆనర్, మా శ్రీ కృష్ణుల వారు చెప్పిన గీతలో ఒక వాక్యం ఇక్కడ కోట్ చేస్తాను వినండి.

"You only control your action. Not the results. So be not motivated by results, nor be attached to inaction"

కోర్టు లో ని జడ్జి గారి కి తల గిర్రున తిరిగింది. ఇట్లాంటి సిద్ధాంతం ఎప్పుడూ విని ఉండలేదు ఆయన. ఆలోచించాడు. ఈ వాక్యం తన పుస్తకం లో రాసుకుని వంద సార్లు చదివిన తనకి అర్థం కాలేదు. తను లా చదివే టప్పుడు తన గురువు గారు చెప్పిన లాయరు సూక్తం గుర్తుకొచ్చింది ఆయనకీ. లా అన్నది లాయర్ ల కి మాత్రమె అర్థం అవ్వాలి. జన సాధారణానికి అర్థం కాకూడదు. అప్పుడే అది లా అనబడును - అదీ ఆయన నేర్చుకున్న ప్రధమ సూక్తం. ఆ ప్రకారం చూస్తె ఈ గీత తనకే అర్థం కాలేదు ఇన్ని మార్లు తిరగేసినా - కాబట్టి ఇది భారద్దేశం లో లా పుస్తకం అయివుండవచ్చు.
"Law has given me this Judge post! To which ever country this belongs, I donot care, but I need to respect Law"

అని ఆ జడ్జీ వారు ఒక నిర్ణయానికి వచ్చి " ఈ గీత లో బహిష్కారం చెయ్య వలసినది ఏదీ నాకున్నట్లు కనిపించడం లేదు. మీదు మిక్కిలి ఈ పుస్తకాన్ని వెంటనే పెర్ఫెక్ట్ గా మన దేశ భాషలో తర్జుమా చేసుకుని లా చదివే వాళ్లకి పుస్తక పాటం గా కూడా పెట్టుకునేలా చెయ్యాలి " అని ఓ జడ్జిమెంటు బర బర గీకి ఆయన ఎంచక్కా పోయారు.

శ్రీ కృష్ణు ల వారు ఈ మారు ముక్కు మీద వేలు పెట్టు కున్నారు. ఔరా, ఈ కాలపు రాధికలు మరీ ఘటికులే ! ఒక్క వాక్యం తో ఈ జడ్జీ గారిని బోల్తా కొట్టిన్చారే సుమీ అని !

రాజి శ్రీ కృష్ణుల వారికి నమోవాకాలు అర్పించింది.

"స్వామీ"


"ఏమీ "

నా మనసులో వున్నది మీకు తెలియదా "

"అమ్మాయ్ మనసులో వున్నది తెలియక పోతే నీ కృష్ణున్ని నేను కాను"

"తెలిసినా నా కోర్కెను తీర్చేరేమీ "


"ఇదో అమ్మాయ్ రాజీ, నువ్వు ఈ కోర్టు కేసు గెలిచావు. నీ కోరిక బుజ్జి పండుని జర్మనీ లో కలవాలి. అంతే కదా"


"స్వామీ వారు చిద్విలాసులు. మనసులో మాటని వెంటనే కనిబెడతారు "


శ్రీ కృష్ణుల వారు చక్రం తిప్పారు. రాజీ గారు అక్కణ్ణించి మాయమయ్యారు. !


******

మ్యూనిచ్ కొనిగ్ స్త్రాస్సే నెంబర్ పదకొండో ఇంటి ముందు ఆగిన బీ ఎం డబ్ల్యూ కారు నించి బులుసు గారు, బుజ్జి పండు, మధురా దిగారు.

మధురా ఇంటి కీ ఓపెన్ చేసి "హాయ్ " అన్న గొంతు వినబడటం తో తిరిగి చూసారు. బులుసు గారు, బుజ్జి పండూ కూడా తల తిప్పి చూసారు.

వెనక రాజీ గారు - ప్రత్యక్షం గా కాన వచ్చారు. !

"ఓహ్ రాజీ గారు, వాట్ ఏ సర్ప్రైజ్! "

బులుసు గారికి తల తిరిగింది ! ఇదేమిటి ఈవిడ గారు ఎక్కణ్ణించి ఇక్కడికి వచ్చారు అని

" ఏమండీ రాజీ గారు చాల సర్ప్రైజ్ "

"అంతా శ్రీ కృష్ణుల వారి చలవ మాష్టారు "

బులుసు గారికి ఈ శ్రీ కృష్ణు ల వారు మరీ అగాతా క్రిస్టీ సస్పెన్స్ బుక్ లా అయిపోయ్యారు !



*****

"తమ పాద స్పర్శతో మా ఇంటిని పరమ పావనం చేసిన

శ్రీశ్రీశ్రీ నవ్వండి బులుసు బ్లాగానంద పెద్ద స్వామీవారు,

శ్రీ శంకర విజయం గావించిన చిన బుజ్జి పండూ కుర్ర స్వామీ వారు,

గీతా కేసు విజేతా రాజీ వారు

స్వాగతం సుస్వాగతం"


మధుర ఇంటి తలుపులు తెరిచి నాటకీయ ఫక్కీలో అందర్నీ ఆహ్వానించింది.

"మధుర గారు, నెనర్లు. కానీ ఈ ఫ్లైట్ లో తిన్న బ్రెడ్డు ముక్కలతో జిహ్వ రుచి అన్న దే మరిచి పోయింది. మాంచి వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ వేసుకుని, వేడి వేడిగా అప్పుడే కాచిన నెయ్యేసుకుని తింటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది" అన్నారు బులుసు వారు, దహించు కు పోతూన్న ఆకలి తాళ లేక ఇంటిలోకి ప్రవేశిస్తూనే నీరస పడి పోతూ.

మధుర సంతోష పడి, "ఓస్, బులుసు గారు, అదెంత సేపవుతున్దండీ. దాంతో బాటే నేను మీకు నిముషం లో మాంచి పసందైన దొండకాయ కూర చేసేస్తాను చూడండీ " అని వెంట నే కిచెన్ లో కి ఎంటర్ అయ్యింది.

రాజీ వారు కొంత సందేహ పడ్డారు!

మధుర బుజ్జి పండు వైపు తిరిగి "పండూ అండ్ కో, వంటయ్యేంత దాకా ఈ బుడత జిగురు ముక్క నోట్లో నములుతూ వుండండి. ఇక్కడి వెదర్ కి ఇది అవసరం " అని వారందిరికి బు జి ము ఇచ్చి తానొక్క ముక్క నోట్లో వేసుకుని దొండకాయ కూర చేసే ప్రాజెక్టులో పడ్డారావిడ.

వంట గదిలో కాకుండా హాల్లో మధ్యలో ఓ పేద్ద సెట్టింగు వేసుకుని దొండకాయలు కోసే ప్రాజెక్టు కోసం, ఓ పేద్ద గిన్నెలో నీళ్ళు తీసుకుని, అందులో దొండకాయలేసి అది తీస్కెళ్ళి అక్కడ పెట్టుకుని ఆసాంతం తీరికగా కూర్చుంది మధుర.

ఇంకో గిన్నేమో కోసిన ముక్కలేయడానికి, మరొకటేమో, తీసేసిన ముచ్చికలు వెయ్యడానికి పెట్టు కుని . కడిగిన కాయలు తుడవడానికి ఒక నేప్కిన్ పెట్టుకుని, . కాయలు కోయడానికి ఓ చెక్క, కోసే ముక్కలు ఆ చెక్క మీద నుంచి కింద పడిపోకుండా జాగ్రత్త కోసం దాని కింద ఓ పేద్ద ప్లేటు, ఓ కత్తి, యీ సెట్టింగు అంతా పెట్టడానికి ఒక పీట, అలాగే తను కూర్చోడానికి మరో కుర్చీ ... ఇదీ ఆవిడ సెట్టింగు.

ఇలా ఓ అరగంటసేపు అటూ ఇటూ తిరిగి, అదెక్కడుంది ఇదెక్కడుంది అని వెతుకుతూ కావలసిన సరంజామా అంతా అమర్చుకున్నా క . ఎదురుగా టీవీ పెట్టుకుని, చేతికందేట్టు రిమోట్ కూడా పెట్టు కుని మధుర, ఇహ జైహింద్ అనుకుని దొండకాయలు తరిగే మహా యజ్ఞం మొదలు పెట్టింది.

ఎంతో పద్దతిగా, ఒద్దికగా ఒక్కొక్క దొండకాయ మీదా స్పెషల్ కేర్ తీస్కుంటూ తరగడం మొదలెట్టి, . అదేంటో, అంత ఇదిగా శ్రద్ధ తీస్కుని తరుగుతున్నా ముక్కలన్నీ ఒక్క షేపులో రావడం లేదు సుమీ అని హాశ్చర్య పోతూ

"బుజ్జి పండూ, నీకో కథ చెప్పనా" అన్నారు మధుర గారు.


ఇక్కడ ఈ తతంగం అంతా అర్ధ గంట పై బడి చూస్తూన్న ముగ్గిరికి ఆకలి పెట్రేగి పోతోంది.

"అమ్మాయ్ మధుర , నువ్వు నిజం గానే వంట చెయ్య బోతున్నావా ? లేక కథ అయ్యేకే మొదలెడతావా వంట వార్పూ? " బులుసు గారిని నీరసం కములు కొంది, "నా తల్లే నా బంగారమే....ఎంత పనిమంతురాలో ." అనుకుంటూ.

"సరే బుజ్జి పండూ కథ తర్వాత చెబ్తానే" అని వంట ప్రాజెక్టుని ప్లాంట్ బియో టెక్నాలజీ పీ హెచ్ డీ అంత శ్రద్ధ తో కొనసాగించి వంట ముగించి "టమాటో పప్పు వంట, అంతా రెడీ" అంది మధుర ఓ ముప్పావు గంట తరువాయి.

టమాటో పప్పు అనంగానే ముగ్గిరికీ మళ్ళీ జిహ్వ జివ్వు జివ్వు మంది.

ఆ హా మన అదృష్టం జర్మనీ లో టమాటో పప్పు కలిపిన కాచిన వెన్న నేయి తో, దొండ కాయ కూరతో మధుర భోజనం - వొహ్ !

"వంట బాగుందండీ ? " మధుర అడిగింది అందర్నీ డిన్నర్ మధ్య లో

"మీ రాశి వారు వంట బ్రహ్మాండంగా చేస్తారు మధురా !" మెచ్చుకున్నారు రాజీ గారు.

బులుసు గారు "అమ్మాయ్ భోజనం బ్రహ్మాండం, కాకపోతే ఓ చిన్నమాట! ఇప్పుడు మనం అన్నం తిన్నాక మన అందరి చేతులూ రెండ్రోజుల దాకా ఇలా పసుప్పచ్చగా ఉంటే బాగోదు కదా! అందుకని, కొంచెం.. ఒక్క రవ్వ పసుపు తగ్గించాలేమో సుమా" అన్నారు తన పసుపు పచ్చని చేతులని చూస్తూ !

బుజ్జి పండు ఫక్కున నవ్వాడు.

"ఫ్రౌ మధుర గారు, రేపటి బ్రేక్ ఫాస్ట్ వేడి వేడి ఇడ్లీని కారప్పొడి, నెయ్యిలో ముంచుకు తింటే ఎలా ఉంటుంది! " అన్నాడు ఆ బుడతడు.

"థాంక్ యు థాంక్ యు " అని మధుర గారాలు పోయింది.

*****

భోజనం కానిచ్చీ కానివ్వకనే , ప్రయాణ బడలిక తో ఉన్న బుజ్జి పండు హారీ పాటర్ కళ్ళద్దాల మధ్య జోగటం మొదలెట్టాడు మధ్య మధ్య లో బులుసు రాజీ మధురల మాట లు వింటూ.

మధుర ఇది గమనించి, "బుజ్జి అప్పుడే చెబ్తా నన్న కథ ఇప్పుడు చెప్పనా " అంది
"ఊ " అన్నాడు వాడు నిద్రలో 'ఊహూ" అనటానికి కుదరక.

మధుర కథ మొదలెట్టింది.


"అనగనగా ఒక ఊర్లో ఓ మిరపకాయ్ పొట్టోడు ఉండేవాడట. ఆ మిరపకాయ్ పొట్టోడు రోజూ తనకున్న సొరకాయంత సైకిలెక్కి ఊర్లోకి వెళ్లి చాలా కష్టపడి పని చేసి బోలెడు డబ్బులు సంపాయించి బాదంకాయంత బంగారం కొనుక్కున్నాడట. మిరపకాయ్ పొట్టోడికి ఈతకాయంత ఇల్లు ఉంటుందన్నమాట!
బుజ్జీ వింటున్నావా ?

"ఊ"

ఆ ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాలో, తను సంపాదించిన ఆ బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, ఆ బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేస్తాడంట.
వింటున్నావా బుజ్జీ ?


"ఊహూ "

ఆ తరవాత ఓ రోజు మిరపకాయ్ పొట్టోడు తన సొరకాయంత సైకిలెక్కి పని మీద బయటికి వెళ్తాడన్నమాట! అప్పుడు ఓ దోసకాయంత దొంగోడు వస్తాడు మిరపకాయ్ పొట్టోడి ఈతకాయంత ఇల్లు దగ్గరికి. మిరపకాయ్ పొట్టోడు ఇంట్లో లేడు కదా అని చెప్పి ఆ ఈతకాయంత ఇంట్లోకి జొరబడిపోయి, గచ్చకాయంత గదిలోకెళ్ళి, ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టి, అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని ........

"బుజ్జీ వింటున్నావా?"


ఇంకెక్కడి బుజ్జి, బుజ్జి పండు కథ మధ్యలోనే సోఫాలో అడ్డంగా పడి ఎప్పుడో నిద్రపోయ్యాడు.

మధుర బుజ్జి పండుని చూసి హ్హా హ్హా హ్హా అని నవ్వి మంచి రగ్గు ఒక్కటి కప్పి బులుసు రాజీ లతో ఖబుర్లతో పడింది.

"మధురా సరి లేరు నీకెవ్వరు కథలు చెప్పడం లో " రాజీ గారు మెచ్చుకున్నారు మధురని.

"అమ్మాయ్ మధురా, , మీ మ్యూనిచ్ నగరం లో గ్లూ వైన్ మార్కెట్ చూడాలని దాని టేష్టు చూడాలని ఆరాటం. ఇప్పటికి మీ జర్మనీ రావడం కుదిరింది, కృష్ణ ప్రియ గారి ఆర్ముగం తో బాతా ఖానీ నెపం తో ! రేపే ఆ మార్కెట్ కెళ్లా లమ్మాయ్ " బులుసు గారు వాక్రుచ్చేరు.

"అలాగే మాష్టారు " మధుర చెప్పింది.

ఆ గ్లూ వైన్ కథా క్రమం బెట్టిదనిన.........



*****

మంచు పువ్వులు ముత్యాల్లా రాలుతూ మ్యూనిక్ మహా నగరం వింత శోభలతో క్రిస్మస్సు ఈవ్ కి ముస్తాబవు తోంది.

మ్యూనిక్ మహా నగరం సాయం కాలం.

మారియన్ ప్లాట్జ్ దగ్గర ముగ్గురు ఇండియన్లు నిలబడి ఉన్నారు. స్మార్ట్ గా వారితో బాటే బుజ్జి పండు కూడా ఉన్నాడు.

"అమ్మాయ్ మధురా, మీ మహా నగర శోభ మరీ తేజోమయం గా ఉంది " అన్నారు బులుసు వారు. తలపై పడుతున్న మంచు పువ్వులని మెల మెల్లన తోసేసు కుంటూ.

మారియన్ ప్లాట్జ్ మునిచ్ మహా నగరానికి నడి బొడ్డు. సమయం ఆరు కావస్తోంది.

అంతకు ముందే వాళ్ళు ఆ మధ్యాహ్నం దరి దాపుల్లోనే ఉన్న గ్లోకేన్స్పీల్ గంట ల కార్యక్రం చూసేరు.

దాన్తోటే కడు రమ్యం గా ముప్పై రెండు బొమ్మలు, ఆసాంతం అవి మానవుల అంత పొడువాటి ఉన్నాయి, అవి బవేరియా లోని ముఖ్య ఘట్టాలని తెలియ జేసేయి. ఒక హరిత వర్ణ పక్షి ఈవెంటు ముగియ గానే మూడు మార్లు కుకూ కుకూ కుకూ అంటూ ముద్దు గా చెప్పింది షో అయి పోయినట్టు.

ఆ పై లంచ్, ఆ పై మళ్ళీ సిటీ దర్శనం అంతా అయ్యేక క్రిస్మస్సు మార్కెట్ లో గ్లూ వెయిన్ కోసం ఇప్పుడు మారియన్ ప్లాట్జ్ వద్ద వాళ్ళు నిలబడి ఉన్నారు ఆ నగర శోభలని ఆనందిస్తూ.

ఎక్కడ చూసినా క్రిస్మస్ కళ కనిపిస్తూ ఉంది . బాగా అలంకరించిన క్రిస్మస్ చెట్లు, క్రిస్మస్ తాత బొమ్మలు, ఈ సమయంలోనే ప్రత్యేకంగా వచ్చే ఎన్నో రకాల చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇంకా ఎన్నెన్నో... విశేషాలతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది.

ఈ క్రిస్మస్ మార్కెట్లో.. చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. 


చిన్ని చిన్ని కొట్లలో బొమ్మలు, ఊలుతో తయారు చేసిన దుస్తులు, చాక్లెట్ పూత పూసిన పండ్లు, ఇంకా మామూలు శాండ్ విచ్ లాంటి తిండి పదార్థాలు అమ్ముతూ ఉన్నారు. మన వూరి తిరనాళ్ళ సంత లా ఉంది మార్కెట్టు.

అన్నిటికంటే ప్రత్యేకమైన ఐటెం .. ఇప్పుడు మన కథ లోని పాత్రలు ప్రత్యేకంగా వెళ్ళేది దేనికోసం అంటే.. అదే Glühwein (గ్లూ వైన్).

బాగా మంచు పడుతోంది. వాతావరణం చాలా చలిగా ఉంది.

"ఈ సమయంలో వేడి వేడిగా Glühwein తాగితే దాని మజా వేరు" చెప్పారు మధుర. "అసలు వైన్ వేడి వేడిగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా.. అదే మరి దీని ప్రత్యేకత. ఈ వైన్ ని ఈ పండగప్పుడు మాత్రమే తాగుతారు".

దగ్గరలోనే ఉన్న ఒక చిన్న స్టాలు దగ్గిరికి నడిచారు వాళ్ళు.

ఈ వైన్ ని అమ్మే స్టాల్లో అప్పటికప్పుడు తయారు వైన్ చేసి కప్పుల్లో పోసి ఇస్తూ ఉన్నాడు షాపతను.

ఒక చిన్న సైజు గంగాళం లాంటి దాంట్లో రెడ్ వైన్ పోసి సన్నని మంట మీద వేడి చేసి, కాస్త వేడి అయ్యాక అందులో చక్కరతో పాటుమసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా మనం బిర్యానిలో వేసే జాజి పువ్వు, లాంటివి వేసి ఇంకాసేపు మరిగిస్తూ ఉంటె అవి ఓ లాంటి మత్తు వాసన లని వెదజల్లుతూ సుమధురం గా మంచు లో తేలి పోతోన్నాయి.

అలాగే నారింజ పండు, నిమ్మ కాయలని తొక్కతో పాటే ముక్కలుగా కోసి అవి కూడా . కొంచెం tangy flavor రావడానికన్నట్టు వేశాడా షాపతడు.

బాగా వేడి చేసాక వేడి వేడి పొగలు కక్కుతున్న Glühwein ని కప్పులో పోసి బులుసు వారికి అందించాడు ఆ షాపతను.

"ఇక్కడి ఈ షాపు బయట ఈ గ్లూ వైన్ తాగుతూంటే, మా ఏలూరు లో టీ కొట్లో నిలబడి చాయ్ తాగుతున్నట్టు ఉందమ్మాయ్, మధురా " చెప్పారు బులుసు వారు ఆ వేడి వేడి వైన్ కప్పుని చేతులతో కప్పు కుని దాని వేడిని ఫీలవుతూ, మరో చేత్తో పైపు కొనసాగిస్తూ.

"బుజ్జి పండూ నీకోసం నాకోసం, రాజీ వారి కోసం కిండర్ పంచ్ ఇదిగో " చెప్పారు మధుర. "Kinder-punsch అచ్చం Glühwein లాగానే చేస్తారు.. కాకపోతే ఇందులో వైన్ కి బదులుగా ఆపిల్ రసం కానీ, ద్రాక్ష రసం గానీ వేసి చేస్తారు. kinder-punsch అంటే Child-punch అన్నమాట! అలా అని పిల్లల కోసం మాత్రమే అనుకునేరు రాజీ గారు, .. మనం కూడా తాగొచ్చు అన్నమాట. కాకపోతే.. పిల్లలు కూడా తాగగలిగింది అన్నమాట "


"రుచి మరీ గొప్పగా ఉంది మధురా " .. ఆ చలిలో.. వేడి వేడిగా.. తీయ తీయగా.. స్పైసీ గా వెరయిటీ గా ఉన్న ఆ కిండర్ పంచ్ ని సిప్ చేస్తూ చెప్పారు రాజీ గారు "మధురా, మా హైదరాబాదీ ఈరానీ చాయ్ కొట్టు వాడు ఇక్కడ ఒక షాప్ పెడితే ఇక వాడు మల్టీ మిలినర్ అయి పోతాడు సుమా " అన్నారు రాజీ వారు.


"Totaal lecker frau madhuraa" చెప్పాడు బుజ్జి పండు కిండర్ పంచ్ ఆస్వాదిస్తూ.

"మన అందరి కోసం ఇక్కడ బాదం పప్పులకి చక్కర పూత వేసి.. వేయించి నవి కూడా కొన్నా నండీ" చెప్పారు మధుర.

"అమ్మాయ్ మధురా, నీ అతిధి సత్కారం మంచి పువ్వుల మధురం మధురాతి మధురం " బులుసు వారు గ్లూ వైన్ టెష్టు చేస్తూ మెచ్చు కున్నారు.

ఆ వాల్టి ఆ మధురమైన సాయంత్రాన్ని మరీ శోభాయమానం గావిస్తూ మంచు పువ్వులు మధుర బ్లాగ్ టెంప్లేట్ పువ్వుల్లా ముసి ముసి నవ్వులతో, మ్యూనిక్ నగరాన్ని ముద్దెట్టుకుని తమ సంతోషాన్ని తెలియ జేసేయి.

*****

మరు సటి రోజే బలుసు వారి పారీసు పయాణం, రాజీ వారి హైదరాబాదు పయనం, బుజ్జి పండు అమెరికా ఫ్లైటు.

మధుర బేలగా ముఖం పెట్టి ఉంది.

"ఫ్రౌ మధురా, ఏమిటి మీరు మరీ మౌనం గా ఉన్నారు" అడిగాడు బుజ్జి పండు.

"అవును బుజ్జీ. బులుసు వారు పారీసు వెళ్లి పోతున్నారు. రాజీ వారు హైదరాబాదు వెళ్లి పోతున్నారు. నువ్వేమో మరి అమెరికా వెళ్లి పోతున్నావు. అందుకే " చెప్పింది మధుర.

"అదేమిటమ్మాయ్, అలా బేల పడి పోతావు. శ్రీ కృష్ణుల వారు నీ చెంతనే వుండగా అంత బేల తనమెందుకు ?" రాజి గారు బుజ్జగించారు మధురని.

"అవును రాజి గారు మీరు చెప్పింది నిజం" మధుర ఆనంద భాష్ఫాలని తుడుచు కుంటూ చెప్పింది.

శ్రీ కృష్ణుల వారు మళ్ళీ ప్రత్యక్ష మైయ్యారు.

అక్కడ ఉన్న అందరూ మాయమై ఫ్రాన్క్ఫర్టు మెయిన్ స్టేషన్ లో ప్రత్యక్ష మైయ్యారు.

బులుసు వారి టీ జీ వీ పారీసు ట్రైను కూత పెట్ట కుండానే నిశ్శబ్దం గా ఫ్రాన్కుఫర్టు హాఫ్భాన్ హాఫ్ స్టేషన్ వదిలి పెట్టింది. రాజీ, మధురా, బుజ్జి పండు చెయ్యి ఊపారు బాయ్ బాయ్ అంటూ బులుసు వారికి.

బులుసు వారి కళ్ళు చెమేర్చేయి..

ఏమిటీ అనుబంధాలు బ్లాగ్ బంధాలు? . ఎక్కడి వాళ్ళం ఎక్కడి వాళ్ళం అంతా ఈ పంచ దశ లోకం లో మిత్రులమై బ్లాగ్ బంధువుల మై ఈ మైత్రీ బంధాలు గల వారం అనుకున్నారు వారు.

శ్రీ కృష్ణుల వారు చక్రం తిప్పారు. రాజీ వారు జర్మనీ నగరం నించి మాయమై హైదరాబాదు లో వున్నారు !

"చ్యూస్, బిస్ స్పాటర్ " మధుర బుజ్జి పండు కి బాయ్ బాయ్ చెప్పింది.

(బుజ్జి పండు తెలుగు చదువు - భామా విజయం ఇంతటి తో సమాప్తం )

*****


బుజ్జి పండు ఫ్రాన్కుఫర్టు ఏర్పోర్టు లో ట్రాన్సిట్ ఏరియా లో ప్రత్యక్షమై , అమెరికా ఫ్లైటు లో నింపాదిగా కాలు పెట్టాడు.
తన సీటు కి వెళ్లి కూర్చుంటూ తల తిప్పి చూసాడు పక్క వున్న దెవరా అని.

"ఆయుష్మాన్ భవ బుజ్జి పండూ, నన్ను చిర్రావూరి భాస్కర శర్మ అంటారు " చెప్పారు పక్క సీటు పెద్దాయన.

"నమస్కారం తాతయ్య గారు !!! " బుజ్జి పండు ఆశ్చర్య పోతూ "మాచనవఝుల వేంకట దీక్షితులు గారూ... మీరేనా. మీరేలా ఇక్కడ ప్రత్యక్షం ?" అడిగాడు బుజ్జి పండు!

"అంతా విష్ణు మాయ బుజ్జి పండూ " చెప్పారు కష్టే ఫలే శర్మ గారు.
(ఇంకా ఉంది)


Sunday, January 29, 2012

శ్రీ కృష్ణ విలాపం !

శ్రీ కృష్ణ విలాపం


స్వామీ శ్రీ కృష్ణుల వారు చిద్విలాసం గా యమునా తీరే - తన పద హారు వేల మంది గోపికలతో కొలువై ఉండగా ఎవెర్ హ్యాపీ బ్లిస్స్ ఆనందా స్వామిజి గారు - ఉండేలు దెబ్బకి పరారి ఐ వచ్చిన కుందేలు వలె కృష్ణా జీ ముందు ధబీల్మని ప్రత్యక్షమై -

"హేక్ కృష్ణ- ఇదేమి నన్నిలా జనాలు వెంట పడి తరిమేలా చేస్తివి? నేనేమి పాపం చేసినాను- నువ్వేమో ముగ్గురు భామల తో చాలక పదహారు వేల మంది గోపికలతో ఉంటె - ఆ హా కృష్ణ విలాసం - అంతా విష్ణు మాయ అని జనాలు పోగిడేరు?

మరి నేను ఒక్కగానొక్క రాగ రంజిత హృదయేశ్వరి తో నా లోకం లో ఉంటె వాడెవడో నీవు శకుని కుటిలత్వాన్ని మాయ బజార్ లో అదేదో దర్పి ణి లో చూపెట్టినట్టు - నన్ను నీ కర్మభూమి లో నీ కర్మ నీదే అన్న రీతిలో నడి రోడ్డులో నిలిపేడు? ఇది ఏమైనా న్యాయమా స్వామీ ? అంటే

క్రిష్ణులవారు తన యోగ నిద్రని కాసేపు పక్కకి పెట్టీ - కళ్ళు మూసుకుని అవలోకించి - భక్తా - ఈ మధ్య నన్ను నీవు మరీ మరీ తలచుకుంటూ ఉంటివి

దేశం లో ఎడా పెడా భగవద్గీతల సభలలో నా గురించి మరీ పొగిడి తివి

ఆ హా నా భక్తుడు ఇంతగా నన్ను పొగిడే గదా అని నేను నిన్ను ఓ క్షణం తలిస్తిని.

మరో మారు తలిచేలోపు మా సత్య - స్వామీ భక్తులని మరీ ఎక్కువైగా తలవకండి ప్రాబ్లెం - అని చెప్పడం తో భక్తులని తలిస్తే ఏమి ప్రాబ్లెం అని ఓ క్షణం ఆలోచనలో పడితిని.

ఇంతకీ ఇదన్న మాట సంగతి - మరీ రసజ్ఞు డవే  అని " సరే అయినదేమో అయినది ఇక కావాల్సిన కార్య మేదో చూడు"  అని సలహా ఇచ్చేరు పరమాత్ముల వారు.

అంతా విష్ణు మాయే - నా చేతి లో ఏముంది అని కృష్ణు ల వారు ఆ యోగ మాయని ఓ క్షణం తలిచేరు.


ఈ కృష్ణుడు కూడా నన్ను కాల రాసాడే అని ఎవెర్ హ్యాపీ స్వామిజి గారు ఇంకా ఏమి చెయ్యడం - అని స్వామీ వారి మీంచి తన దృష్టిని యమునా పైకి - ఆ పై పదహారు వేల గోపికల పై కి చూపులని సారించేడు.

గోపికలలో రాగ రంజితాలు ఆతనికి గోచరించినై.

ఆ హా అర్థమైంది - యోగ మాయ ఉద్దేశం ఇదన్న మాట అని స్వ భాష్యం చెప్పుకుని "గోపికలూ - మీకు వ్రిందావనం గురించి చెబ్తాను ఇలా రండి " అన్నాడు చిరు నవ్వుతో !

అదిగో అప్పుడే మొదలైంది - శ్రీ కృష్ణులవారి "విలాపం" !

ఆ కాలం లో శంకరుడే భోళాశంకరుడని అనుకుంటిని - ఈ కలి యుగం లో నన్నే ఈ మానవుడు - బోల్తా కొట్టిన్చాడే - అని.

శ్రీ కృష్ణుల వారి విలాపాన్ని విని - కల్కి భగవాను ల వారు,

"వరదా" - నేను నీకు కలి గీత నేర్పిస్తాను ఇలా రా నాయనా అని

 "వరదా- భగవంతునికి భక్తునికి అనుసంధాన మైనది అంబికా అగరొత్తులు మాత్రమె కాదు - అంబిక "గరం" ఒత్తులు కూడా అనడంతో, కృష్ణుల వారు మూర్చ పోయి "హా సత్యా" - అంటే - హుష్ కాకి- సత్యమే లేచి పోయింది. !

******

అలా మూర్చ పోయిన కృష్ణ స్వాములు కొంత సేపటి కి తేరుకుని - కనులు తెరిచి చూసారు.

వారి కి కొంత దూరం లో - ఎవెర్ హ్యాప్యానంద, "విష్" ఆనంద , సీనియర్ ఐన భగవానంద అందరు కలిసి చిద్విలాసంగా స్వామీ వారి ని చూపిస్తూ - గోపిలకి  "డిష్" ఆనందా లాగ,

"అమ్మాయిలూ- భగవంతుడనే సాటి లైట్ కి మేము డిష్ లం.

మీ టీవీ లో ఆయన పిక్చర్ కనిపించాలంటే - మా లాంటి డిష్ ల అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం మా డిష్ లకి ప్రణమిల్లుకోండి అని ఉపన్యాసం దంచేస్తుండగా
కృష్ణ స్వాముల వారి కి ఏమి చెయ్యాలో పాలు పోక సరే పొతే పోనీ వీరి బాధ లేమి టో కనుక్కుంటే తాను ఏమైనా హెల్ప్ చెయ్య గలడేమో అని ఆలోచించి,


"ఓ స్వాములార - నేను ద్వాపర యుగం నాటి వాణ్ని.

మీ కష్టాలేమి? మీ కేమైనా కష్టాల ? నష్టాల? అని అడిగి చూసారు.

 స్వాములు నవ్వి - ఒకరి తరువాత ఒకరు గా ఇలా వాక్రుచ్చేరు.

"కృష్ణా ,  నువ్వు పురాణ కాలం లో ఉన్నావు.  పిల్లన గ్రోవి ఉంటె చాలను కుంటున్నావు . తప్పు స్వామీ, తప్పు .

ఈ కాలం భక్తులకి ఇవన్ని పనికి రాని వస్తువులు. ఈ కాలం లో భక్తులకి, బ్లాగులు - అంతర్జాల చమక్కులు -యు ట్యూబ్ బ్రాడ్ కాస్ట్ యువర్ సెల్ఫ్ లు లాంటి వి ఉంటె నే - స్వాముల వారి ని గమనిస్తారు.  ఎవరి కి ఎంత మంది ఫాన్స్ అన్నది వీటి మీద ఆధార పడి ఉంటై.

నీ టైం లో నువ్వు ఓ పద హారు వేల మంది నే పిల్లన గ్రోవితో ఆకర్షిస్తివి. 

నీ పిల్లన గ్రోవితో ఈ కాలం లో ఓ పోరిని కూడా పట్టలేవు నాయనా అని భగవానంద చెప్పగా కృష్ణుల వారు ముక్కు మీద వేలు వ్రేసుకుని తన పిల్లన గ్రోవిని ఓ మారు తడిమి చూసుకున్నారు-


"కృష్ణా - నీ కు పిల్లనగ్రోవిని ట్యూన్ చెయ్యడం మాత్రమె తెలుసు - మా ఎవెర్ హ్యాపి ఆనందా స్వామీ వారి కి పిల్లని ఎక్కడ మీటితే మిర్చి ఎఫ్ ఎం లా బాలీవుడ్ స్టైల్ కాకుంటే పాప్ స్టైల్ పలుకుతుందో - ఎక్కడ వేలిని తాకితే - ఎక్కడ తీగలు కదులు తాయో తెలుసు" అని విష్ ఆనందా వారు- గడ్డం తడివారు.


"కృష్ణా - విష్ ఆనందా తక్కువేమీ కాదు సుమా - ఆయన ఉత్తరాది వాడు - రెండు వేదాలు ఎక్కువే చదివేడు - అని ఎవెర్ హ్యాప్పీ ఆనందా స్వామీ వారు తనకు తెలియక పోయినా విష్ ఆనందా గారి గురించి పొగి డేడు.


కృష్ణ స్వాముల వారు ఓ మారు బుర్ర గోక్కుని - సరే స్వాములు - ఈ అమ్మాయిల విషయం లో ఏమి ఈ చపలత్వం - ఓ పక్క నా భగవద్గీత ని కాపీ రైట్స్ లేకుండా కాపీ కొడుతూ? అని అడిగిందే తడవు గా


ఎవెర్ హ్యాపి ఆనందా వారు- అమెరికన్ స్టైల్ లో - హేక్ క్రిస్- పురాణ కాలం లో ఎవడో పిచ్చి సన్నాసి ఈ కాషాయ వస్త్రాలని మా యూని ఫోరం గా పెట్టి పోయేడు. అప్పట్నుంచి మాకి ఇదో ట్రేడ్ మార్క్ ఐపాయింది.


ఓ రాజకీయ నాయకుడు పంచ కడతాడు. ఓ మిలిటరీ ఆఫీసర్ యూనిఫారం   వేస్తాడు. ఓ కలక్టరు సూట్ వేస్తాడు.

వీళ్ళంతా తమ పెళ్ళాల తో శృంగారం సాగించడానికి - సాంఘిక వ్యవస్థ ఆస్కారం కలిపించింది - పెళ్లి అన్న పేరుతో.

దాన్ని మీరి ఎంత మంది పొరిగింటి పోరి ల మీద పడటం లేదు? కాదన గలవా?

సన్నాసి కాషాయ వస్త్రాలు తీస్తే - శరీరం - సంసారి బట్టలూడ దీస్తే - శరీరం - దాని అవసరం దానికి - అంతా - నీ యోగ మాయ విలాసం - కాదంటావా?

పొయ్యే కాలం ఏమిటంటే - మాకు  వ్యవస్థ లేదు - శరీరాన్ని సుఖ పరచడానికి ఈ పిచ్చి మా లోకం మమ్మల్ని వీటి కి అంటరాని వాళ్ళ లా చూస్తోంది. కాదంటావా ?

అదీ గా క మా వద్ద వచ్చే పోరులంతా - యమ రంజుగా ఉండటం మేము చేసుకున్న పుణ్య ఫలం - ఈ కుళ్ళు బోతూ మా లోకం వాళ్లకి - ఈ పాటి తీరికా లేదు -పెళ్ళాల్ని సుఖ పెట్టడానికి! 

వీళ్ళంతా మేమేదో ఉద్దరిస్తామని మా దరి కోస్తారు- దరి కొచ్చే సుందరి ని కాదనడానికి మేము ఏమైనా వెర్రి సన్నా సులమా? " అని హింట్ ఇచ్చేడు.


కృష్ణా జీ "హా సత్యా" అని మరో మారు మూర్చ పోయేరు - ఇంకెక్కడి సత్యం- సత్యమెప్పుడో  లేచి పోయింది!
*****


శ్రీ కృష్ణుల వారు - కాస్త సమయం తీసుకొని నిద్ర లేచారు.

చుట్టూ చూసారు.

నిర్మానుష్యం. స్వాములు లేరు. తన పరివారమూ లేరు.

ఓ మారు కళ్ళు మూసుకుని ప్రశాంతం గా అవలోకించి - సరే ఫైనల్ గా మళ్ళీ ఓ మారు కర్మ భూమి లో - ఈ మారు సామాన్య ప్రజానీకాన్ని కదలించి - మీ కష్టాలేమిటి- ఇలా స్వాములోళ్ళతో ప్రాబ్లెమ్స్ లో ఇరుక్కుంటారేమిటీ ? అని కనుక్కుందామని, ప్రక్కన నారదుల వారు ఉంటె మంచిదని వారిని పిలుచుకొని కర్మ భూమి కి వచ్చేరు.

*****

కర్మ భూమి లో-

ఓ అమ్మాయీ, వాళ్ళ పేరెంట్స్ ఓ స్వామిజి ని కలవడానికి వెళ్తున్నారు- ఆ అమ్మాయిని నారదులవారు కదలించారు - "అమ్మాయీ అమ్మాయీ ఈ స్వామిజి ని ఎందుకు కలవాలని వెళ్తున్నావు?"


ఆ అమ్మాయి " ఏమో తెలీదు- మా అమ్మ వెళ్తోంది నేను వెళ్తున్న" అన్నది .

"అమ్మా , మీరెందుకు వెళ్తున్నారు? అంటే- "అదేమో తెలీదు - మావారు వెళ్తున్నారు - నేను వెళ్తున్నాను " అన్నది ఆవిడ.


"అయ్యా మీరెందుకు వెళ్తున్నారు స్వామీ? " అంటే- ఆ భర్త గారు- "మా ఆఫీసు లో నాకు ప్రొమోషన్ రాలేదండీ,  స్వామీ వారి బ్లెస్సింగ్ ఉంటె వస్తుందేమో అన్నఆశ తో వెళ్తున్నా"  అన్నాడు.


మరో అయ్యని కదలిస్తే - మా ఆవిడ వెళ్తోంది కాబట్టి నేను వెళ్తున్నాను అన్నాడు.


"భార్య గారు భార్య గారు - మీరెందు కు వెళ్తున్నారు " అంటే-

"చాలా కాలం నించి మాకు పిల్లలు లేరు.  ఈ బేబీ ఆనందా స్వామీ వారు  "ముద్దు బ్లెస్సింగ్" తో పిల్లల్ని పుట్టిస్తారని విన్నాము - ఆయన బ్లెస్సింగ్ తో పిల్లలు పుట్టాలని"  -చెబ్తూ పరవశం తో కనులు మూసుకుంది, ఆ భార్యా మణి!


మరో మానవుణ్ణి కదలిస్తే- "శ్రీ కాపానందా స్వామీ వారు మా కులం వారు- ఆ పాటి మేము సపోర్ట్ ఇవ్వక పొతే ఎలా?"  అన్నాడు.


ఓ రాజకీయ నాయకుణ్ణి కదలిస్తే-

"స్వామీ మీకు తెలియనిది ఏమి ఉన్నది? ఎక్కడ జన సందోహం ఎక్కువో అక్కడ మేముంటేనే మాకు పరపతి- మా ఇమేజ్ పెరగాలంటే - మేము ఈలాంటి 'సంఘాలని' సమాజలని తప్పక చూసి మా వచ్చే ఎన్నికలకి తయారు గా ఉండాలి"  అన్నాడు.


ఓ సిని తారని కదలిస్తే- "అందం ఒక్కటే కాదు స్వామీ మా ఫీల్డ్ కి కావాల్సింది- కాస్త పరిచయాలు కూడా,  ఇట్లాంటి పరిచయాలు - ఈ లాంటి క్లబ్బుల్లో మాకు చిక్కుతాయి అంది గుంభనగా.


ఓ విదేశీయుణ్ణి అడిగితే - "యోగం భోగం ఈ కర్మ భూమిలో దొరుకుతాయి స్వామీ అందుకే వచ్చా " అన్నాడు ఆ విదేశీయుడు !.


ఓ కాటి కి కాలు చాపుకున్న ముసలి వాణ్ని అడిగితే - "వచ్చే జన్మలో నేను ఎవెర్ యంగ్ గా" ఉండాలని స్వామీ వారి బ్లెస్సింగ్ కోసం వెళ్తున్న " అన్నాడు.


ఓ కుర్రకారు- "అక్కడ నా వయసు అమ్మాయిలూ ఎక్కువ వస్తారు నారదా - కాలేజి తరువాయి ఇక్కడే మా కాజోల్ ని మేము వెతకాలి " అన్నాడు.


ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ - ఆన్ సైట్ రావాలని - బ్లెస్సింగ్ కావాలన్నాడు.


ఓ మీడియా వాణ్ని అడిగితే -

"స్వామీ మా ప్రజలకి ఇరవై నాలుగు గంట లు మసాల న్యూస్ కావాలి.

మేము మసాల న్యూస్ ఇరవై నాలుగు గంట లు ఇవ్వాలంటే - జన సందోహ ప్రదేశాలలో - వెతికి వెతికి మసాల న్యూస్ లు పట్టాలి.

దానికి కొంత మార్ఫిజం  చెయ్యాలి - అప్పుడే మా ప్రేక్షకులకి నప్పుతాయి !

లేకుంటే మా ఛానల్ రేటింగ్ గోవిందా!

అంతెందుకు - గోవిందా గోవిందా ఛానల్ చూడండి - స్వామీ వారికే పబ్లిసిటీ కావాల్సి వొచ్చే- ఇరవై నాలుగు గంట లు"  

అంటూ వాపోయాడు ఆ మీడియా మానవుడు.

ఇవన్నీ వింటూ పోతూంటే - సైలెంట్ గా ఉన్న కృష్ణ స్వామీ వారి కి మళ్ళీ తల తిరిగింది.


ఇందులో ఒక్కరి కి కూడా భక్తీ అన్నది ఉన్నట్టులేదు.

యద్భావం తద్భవతి.

కోరికలే గుర్రాలు గా నా కర్మ భూమి వాళ్ళు స్వారి చేస్తూన్నారు. చేయి చేయి కలవనిదే చప్పట్టు రాదు.

ఈ చేయి కి ఆ చేయి ఆసరా.

భగవంతుడు సృష్టి కార్యం కోసం స్త్రీ పురుషులని సృష్టించాడు.

ఈ మానవులు - తమ కోరికల కోసం - వాటిని ఈదేరడం కోసం - ఈ స్వామిజి ల వెంట వేలం వెర్రి గా పడుతున్నారు.


ఇందులో సో కాల్డ్ భగవంతుని గా నా స్థానం ఏమి లేదు - కాకుంటే - శంఖం పూరించి- యదా యదాహి గ్లానిర్భవతి భారతా- అని మరో మారు అవతారం ధరించవచ్చు.

అయినా అందు వలన ప్రయోజనం ఉంటుందా? -

దీనికి పరిష్కారం ఏమిటి? అన్న ఆలోచనలో పడి -

కృష్ణాజి " హా సత్యా" అన్నారు.

ఈ మారు సత్య పక్కనే నిలబడి "స్వామీ " అన్నది.

ఏమి పరిష్కారం? అన్నారు కృష్ణాజి.

"నరకాసుర వధ" స్వామీ అన్నది సత్య. "మనిషిలోని అసురుడు వెళితేనే - కోరికలు తగ్గిస్తేనే - వీళ్ళ జీవితాలలో - జీవనం.  లేకుంటే - యధో కర్మహ తతో ఫలః " అన్న అర్థం వచ్చేలా !

సత్య కు తెలిసిన సత్యం అదే!

(సమాప్తం)